దివంగత మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మను కేంద్ర దర్యాప్తు బృందాలు (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నాయి. ప్రకాశం జిల్లా అలకూరపాడులోని సృగృహంలో ఒంటరిగా ఉన్న ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లాయి. ఎన్ఐఏ, ఎస్ఐబీ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో శుక్రవారం అలకూరపాడు చేరుకున్నారు. నేరుగా శిరీష ఉన్న ఇంట్లోకి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 28వ నుండి ప్రారంభంకానున్న మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో శిరీషను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవలే ఎన్ఐఏ అధికారులు శిరీష ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో శిరీష ఇంట్లో లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లి వచ్చే లోపు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారని శిరీష అప్పట్లో మీడియాకు తెలియజేశారు. భర్త, కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండగా విచారణ, సోదాలు అంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆమె అవేదన వ్యక్తం చేశారు. తాను మావోయిస్టులకు డబ్బు పంపించినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని శిరీష అప్పట్లో తెలిపారు. తాజాగా అమెను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయడం సంచలనమైంది.