Mansas Trust: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ చైర్మన్ పూసలపాటి అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు, వ్యక్తిగత దుషణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఏపి, తెలంగాణ క్షత్రియ సమాజం ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అశోక్ గజపతిరాజును ఆ విధంగా విజయసాయి రెడ్డి దూషిస్తూ విమర్శలు చేయడాన్ని రాజకీయాలకు అతీతంగా అనేక వర్గాలు తప్పుబడుతున్నాయి. తాజాగా కాపు ఉద్యమనేత, సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కూడా స్పందించారు. ఈ అంశంపై జోక్యం చేసుకుని వైసీపీ నాయకులను కట్టడి చేయాలంటూ సీఎం వైఎస్ జగన్ కు ముద్రగడ లేఖ రాశారు. సాధారణంగా అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ఎవరైనా లేఖలు రాస్తే సీఎం వైఎస్ జగన్ పెద్దగా పట్టించుకునే అవకాశాలు ఉండవని అందరికీ తెలిసిందే. కానీ ముద్రగడ్డ పద్మనాభం లేఖ అంటే కొంత వరకూ జగన్ స్పందించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అందుకు కారణం ముద్రగడ వ్యక్తిత్వం కారణం.
అశోక్ గజపతిరాజుపై విజయసాయి చేసిన వ్యాఖ్యలను ముద్రగడ తప్పుబట్టారు. అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామని విజయసాయి రెడ్డి అనడం బాధాకరమనీ, అశోక్ గజపతిరాజును అవమానించవద్దని పార్టీ నేతలకు జగన్ ఆదేశాలు ఇవ్వాలని ముద్రగడ లేఖలో కోరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల క్షత్రియులు చేసిన ప్రకటనను జగన్ సీరియస్ గా తీసుకోవాలన్నారు. రాజ్యాలు పోయినా అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని అందరూ గౌరవిస్తారని, అశోక్ గజపతిరాజు కుటుంబం వేల ఎకరాలు ధారదత్తం చేసి ట్రస్ట్ లు ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ. అశోక్ గజపతిరాజు పై అసభ్యంగా మాట్లాడకుండా వైసీపీ నేతలను కట్టడి చేయాలని ముద్రగడ కోరారు. అయితే ముద్రగడ లేఖపై సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
మరో పక్క విజయసాయిరెడ్డి మాత్రం తన ట్వీట్ లకు నెటిజన్ ల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేక స్పందన వస్తున్నా ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మంగళవారం సైతం అశోక్ గజపతిరాజుపై వరుస విమర్శల ట్వీట్లు వదిలారు. మెడికల్ కాలేజీ పెడతామని మాన్సాస్ భూముల్ని అశోక్ తెగనమ్మాడని ఆరోపించారు. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టకుండా అడ్డుకున్నారని విమర్శించారు. గత నెలలో సీఎం జగన్ విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారని విజయసాయి పేర్కొన్నారు. అశోక్ మెడికల్ కాలేజీ ప్రతిపాదన ఏమైందని ప్రశ్నించారు.
తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి మాన్సాస్ భూముల్లోని ఇసుకాసురులెవరు? 2020లో ఏపి ఎండీసీకి అప్పగించక ముందు అక్కడ ఇసుక మైనింగ్ చేసింది ఎవరు? టీడీపీ హయాంలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే కళ్లు మూసుకున్నావా ? సొంత పార్టీ నేతలు తవ్వేస్తుంటే దృతరాష్ట్రుని పాత్ర పోషించావా? వాటాలు తీసుకుని ఊరుకున్నావా? అశోక్ అంటూ విజయసాయి ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు మెప్పు కోసం మాన్సాస్ విద్యాసంస్థలకు రావాల్సిన రూ.35 కోట్ల స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను అశోక్ వదిలేశాడని విమర్శించారు. 2017లోనే పలు విద్యాసంస్థలను సరెండర్ చేశాడని పేర్కొన్నారు. ఐదేళలపాటు చైర్మన్, అంతకు ముందు దశాబ్దాల పాటు ట్రస్ట్ లో చక్రం తిప్పాడు. అసలు మాన్సాస్ ట్రస్ట్ లో ఆడిటింగ్ జరిగిందో లేదో తెలియదు. ఆడిట్ పై సమాచారం కావాలంటూ అధికారులకు ఇప్పుడు లేఖలు రాస్తున్నాడు. అంటే తాను చైర్మన్ గా ఉన్న ట్రస్ట్ లో ఎంత దోపిడీ జరిగిందో తెలియని స్థితి అసమర్థ అశోక్ ది” అని విజయసాయిరెడ్డి విమర్శించారు.