Narendra Modi : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రథసారథి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి కొత్త చర్చ జరుగుతోంది. సహజంగానే మోడీ నిర్ణయాలు సంచలనంగా ఉంటుంటాయి. అయితే తాజాగా ఆయన నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరణ జపం చేస్తోంది.
ఏపీలోని ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ గురించి హాట్ హాట్ చర్చ జరుగుతున్న సమయంలో మరో సంచలన ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలే కాదు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలూ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Narendra Modi ఆ సంస్థలకు టెండర్ పెట్టేశారు…
లోక్సభలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్రామ్ నష్టాల బాటలో ఉన్న సంస్థలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పునరుద్ఘాటించారు.
నోడల్ ఏజెన్సీగా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ పనిచేస్తుందని సంస్థల మూసివేతపై విధివిధానాలు సవరించి త్వరలో నోటిఫై చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలూ ప్రైవేటీకరణ చేస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు కూడా ఇస్తోందని అర్జున్ రామ్ ప్రకటించారు.
కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయడంతో…
అభివృద్ధి జరగాలంటే ప్రైవేటీకరణ తప్పదని కుండబద్దలు కొట్టి మరీ కేంద్ర ప్రకటనలు చేయడంతో ఢిల్లీ పెద్దల నిర్ణయంపై ప్రజలు భగ్గుమంటున్నారు. అయితే, దీనికి కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సైతం అమ్మేస్తున్నామని చెప్పేయడంతో పాటుగా దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తామని ప్రకటించడంతో కేంద్రం ఏం చేస్తుందనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం నిర్ణయాలతో బీజేపీకి రాబోయే కాలంలో షాక్లు ఇవ్వడం ఖాయమనే అంటున్నారు.