Nimmagadda : ఏపిలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఎస్ఈసీ నిర్ణయాలను జగన్ సర్కార్ లైట్ గా తీసుకుంటోంది. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, వైసీపీ నేతలు ఎస్ఈసీ నిమ్మగడ్డను పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఏజంట్ అన్నట్లుగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ తయారు చేసిందనీ, దీని ద్వారా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం అధికార వైసీపీలో కొంత అలజడి మొదలైందట. ప్రభుత్వ నిఘా యాప్ ఉండగా నిమ్మగడ్డ ఎన్నికల సంఘం కోసం ప్రత్యేక యాప్ తయారు చేయడం మరిన్ని అనుమానాలకు తావు ఇస్తోందట.
ఇప్పటికే నిమ్మగడ్డను చంద్రబాబు మనిషిగా ఆరోపణలు చేస్తున్న వైసీపీ దీని వెనుక టీడీపీ ఉందని అంటున్నారుట. ఇప్పటి వరకూ ఈ యాప్ గురించి ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. కానీ రెండు మూడు రోజుల్లో బయటకు వదులుతారని ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ అనుకూల మీడియా మాత్రం ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ యాప్ లో కుట్రకోణం దాగి ఉందని ప్రచారం చేస్తోంది. యాప్ తయారు చేసిన కంపేనీ ఏంటి, ఆ బాధ్యతలు ఎవరు అప్పగించారు. యాప్ లో వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంటాయా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారుట.
మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పంచాయతీ ఎన్నికల కోసం ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, న్యాయమైన సమస్యలు తీర్చేందుకు న్యాయవాదులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం చూస్తుంటే టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటున్నారు. దీనికి తోడు ఈ యాప్ గోల కూడా వైసీపీకి ఇబ్బందులకు గురి చేస్తున్నదట. ప్రభుత్వ పిలుపుతో గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవాలకు మొగ్గు చూపుతున్నా టీడీపీ రాజకీయం చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రాజకీయ కక్షలు పెరుగుతాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఒక వేళ ఎన్నికల సంఘం యాప్ తీసుకువస్తే ఎటువంటి సంఘటనలు జరగకపోయినా దౌర్జన్యాలు జరిగినట్లు తప్పుడు ప్రచారం చేసి ఏకగ్రీవాలను చెడగొట్టే అవకాశం ఉందన్నఆందోళనలో ఉన్నారుట. ఈ నేపథ్యంలో ఈ అసలీ యాప్ ఎప్పుడు బయటకు వస్తుందో దాని సంగతి ఏమిటో తేలాల్సి ఉంది.