YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధించిన పార్టీతోనే షర్మిల కలిశారని వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పెట్టిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె నిర్ణయాలు ఆమె ఇష్టమని అన్నారు. ఇదే క్రమంలో చంద్రబాబుపైనా విమర్శలు చేశారు సజ్జల. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు.
సీఎం జగన్మోహనరెడ్డి విషయంలో ప్రజలా.. కుటుంబమా అన్న ప్రశ్న వస్తే ఆయన ఛాయస్ ప్రజలేనని అన్నారు. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదని అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు ఫలితం ఏమయ్యిందో అందరికీ తెలుసునని అన్నారు.
వైఎస్ జగన్ తన కుటుంబం కోసం పార్టీ లేదని అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా జనం ఎరిగిన నేతగా జగన్ దూసుకుపోతున్నారని అన్నారు. ఎంత మంది వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని చెప్పారు. ఇదే సందర్భంలో పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలపైనా స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నియోజకవర్గాల్లో మార్పులు ఏ పార్టీలో అయినా అంతర్గతంగా జరగాల్సిన కసరత్తేనని అన్నారు. అసంతృప్తి నేతలను నచ్చజెప్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పార్టీ ఇన్ చార్జిలు, ఎమ్మెల్యేల మార్పులు చేసిన చోట స్పందన బాగానే ఉందని అన్నారు.
అంగన్ వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని సజ్జల సమర్ధించారు. అంగన్ వాడీలు సమ్మె మొదలు పెట్టి నెల రోజులు అవుతోంది. వారికి నచ్చచెబుతున్నా వినకపోవడంతో ఎస్మా ప్రయోగించామని అన్నారు. బాలింతలు, పసి పిల్లలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు సజ్జల. తాము సంయమనంతో ఉన్నామనీ, ఒకటి రెండు డిమాండ్ లపై అంగన్ వాడీలు పట్టుబడుతున్నారని సజ్జల అన్నారు.