వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కాల్ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాధవ్ అశ్లీల వీడియో కాల్ పై సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలు టీవీ ఛానల్స్ లో దీనిపై డిబేట్లు నిర్వహించడం, వివిధ రాజకీయ పక్షాలు మాధవ్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై మాధవ్ స్పందిస్తూ ఇది మార్ఫింగ్ వీడియో అని, తన ను అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు ఈ విధంగా చేశారనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏ విచారణకైనా సిద్ధమేనని చెప్పారు. అయినప్పటికీ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ అంశంపై వైసీపీ స్పందించింది.
దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ అది వాస్తవం కాదనీ, పోలీసు కేసు కూడా పెట్టానని గోరంట్ల మాధవ్ తనతో చెప్పారన్నారు. ఈ అంశంలో నిజంగా ఆయన తప్పు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. తమ పార్టీ మహిళల పక్షపాత పార్టీ అని పేర్కొన్న సజ్జల.. నిజంగా తప్పు ఉంటే తమ నాయకుడు ఊరుకోరని చెప్పారు. టీడీపీ రాద్ధాంతం చేస్తొందని అన్నారు. గోరంట్ల మాధవ్ పోలీసు కేసు పెట్టారనీ, వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. అది మార్ఫింగ్ వీడియో కాదు నిజమేనని తెలితే చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
మరో పక్క ఈ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ వివరణ ఇచ్చారు. తాను వీడియో లీక్ చేశానంటూ గోరంట్ల మాధవ్ ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. మాధవ్ పర్సనల్ వీడియోకు తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు విజయ్.