టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నామినేషన్ల పర్వం ప్రారంభైన తర్వాత.. కూడా అభ్యర్థులను మారుస్తున్నారు. తాజాగా నర్సాపురం సిటింగ్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజుకు ఉంటి సీటు ఇచ్చేశారు. ఈ సీటును ఇప్పటికే ప్రకటించిన మంతెన రామరాజును బుజ్జగించి.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. చంద్రబాబు వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిందో ఏమో.. బీజేపీ అలెర్ట్ అయింది. నర్సా పురం ఎంపీ సీటును తమ అభ్యర్థి శ్రీనివాస వర్మకు ముందే ప్రకటించిన బీజేపీ వెంటనే ఆయనకు బీఫాం కూడా ఇచ్చేసింది.
దీంతో నరసాపురం పార్లమెంటు స్థానం నుంచిరఘురామ పోటీచేసేది లేదని తేలిపోయింది. మరోవైపు.. పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ చీఫ్గా ఉన్న తోట సీతారామలక్ష్మిని పార్టీలో పొలిట్బ్యూరోగా తీసుకున్నారు. ఇక, తనకు సీటు ఇవ్వలేదని అలిగిన.. బండారు సత్యనారాయణ మూర్తికి కూడా చంద్రబాబు అభయం ప్రసాదించారు. ఆయనకు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సీటును ఇచ్చేశారు. దీంతో ఒక సమస్య తప్పింది. అయితే.. ఇక్కడ తొలి జాబితాలోనే టికెట్ దక్కించుకున్న ఎన్నారై పైలా ప్రసాద్నిరాశకు గురయ్యారు. శుక్రవారం ఆయన అమెరికాకు వెళ్లిపోతున్నారు.
బండారు ఆశించింది.. పెందుర్తి అయితే.. ఈ సీటు జనసేనకు ఇవ్వడంతో ఇప్పుడు ఆయనకు మాడుగుల ఇచ్చారు. అయితే.. ఇక్కడ ఇప్పటికే పైలా ప్రచారం చేసుకుని ఉండడంతో ప్రజలు ఏమరకు బండారు వైపు మొగ్గు చూపుతారనేది ప్రశ్న. అదేవిధంగా ఉండిలో చేసిన మార్పు కూడా.. టీడీపీకి ఇబ్బందేనని అంటున్నారు. మంతెనరామరాజు వర్గం సహకరించే పరిస్థితి లేదు. మరో నేత కలవపూడి శివ పార్టీకి రాజీనామా చేయకుండానే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నారు.
సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గంలోనూ మార్పు చేశారు. తొలి జాబితాలో ప్రకటించిన అనిల్ను పక్కన పెట్టి.. పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు ఎంఎస్ రాజుకు ఈ సీటు ఇచ్చారు. ఇక్కడ కూడాపార్టీకి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లిలో ముందే ప్రకటించిన జయచంద్రారెడ్డిని పక్కన పెట్టి.. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ సతీమణి సరళా రెడ్డికి ఇచ్చారు. మొత్తంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యాక చేసిన ఈ మార్పులు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.