బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు సికింద్రాబాద్ కోర్టులో మరో సారి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు జరిగాయి. ప్రవీణ్ రావు సోదరుల అపహారణ కేసులో అఖిలప్రియను ఈ నెల 6వ తేదీన అరెస్టు చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో పురోగతి కోసం ఈ నెల 12వ తేదీ నుండి మూడు రోజుల పాటు కస్టడీలోకి పోలీసులు విచారించారు. కస్టడీ ముగిసినందున బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదనీ, పోలీస్ కస్టడీ విచారణ పూర్తి అయనందున బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో అఖిలప్రియ కోరారు.
అయితే అఖిలప్రియపై నమోదు చేసిన కేసులో పోలీసులు అదనపు సెక్షన్ లు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 395 డెకాయిట్ నమోదు చేసిన పోలీసులు అఖిలప్రియకు బెయిల్ ఇవ్వవద్దని కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులైన భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను మరి కొందరు పరారీలో ఉన్నారని పోలీసులు కౌంటర్ పిటిషన్ లో వెల్లడించారు. అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేస్తే ఇతర నిందితులు దొరికే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం..జీవిత కాలం శిక్షపడే కేసులు తమ పరిధిలోకి రావని పేర్కొంటూ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో అఖిలప్రియ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.