TDP : విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో పెద్ద పోరాట ఫలితంగా సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని రాజకీయాలను వేడెక్కించాయి. ప్రజా ప్రతినిధుల రాజీనామాల పర్వానికి దారి తీస్తున్నాయి. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ పార్టీలను కలవరపాటుకు గురి చేస్తుంది. ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఇదే బాట పట్టేలా వారిపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
TDP : గంటా బాట పట్టేదెవరో?
విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావు రాష్ట్రంలో అధికార మార్పిడి తరువాత టీడీపీలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గంటా రాజీనామా నేపథ్యంలో గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు పివిజిఆర్ నాయుడు (గణబాబు), వెలగపూడి రామకృష్ణ బాబు వైపు అందరి దృష్టి పడుతోంది. టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంతకు ముందే వైసీపీ గూటికి చేరిపోయారు. గంటా తరహాలో గణబాబు, రామకృష్ణ బాబులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుండగా ఇంకా వారు దీనిపై స్పష్టత ఇవ్వలేదు.
టీడీపీలో ఆందోళన?
అయితే నాన్ పొలిటికల్ జెఏసీ ఏర్పాటు జరిగి ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరారు. గంటా పార్టీలో ఉండీ లేనట్లుగా ఉండి ఇప్పుడు రాజీనామా చేశారు. మరో ఇద్దరు రాజీనామా చేస్తే అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చంద్రబాబుతో సహా 16 మందే ఉంటారు. ఇదే గనుక జరిగితే టీడీపీ అసెంబ్లీలో టీడీపీ బలం మరింత తగ్గిపోయి ప్రతిపక్ష హోదా గల్లంతు అవుతుందని అంటున్నారు. అందుకే చంద్రబాబు రాజీనామాలకు సిద్ధపడకుండా ఉద్యమాన్ని ముందుకు నడపాలని విశాఖ జిల్లా నేతలకు సమాచారం ఇచ్చారని అంటున్నారు.
గంటాకు చిత్తశుద్ధి లేదు
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఇదొక డ్రామాగా అభివర్ణిస్తున్నారు. గంటా తన రాజీనామాను స్పీకర్ ఫార్మెట్ లో పంపకుండా స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత తన రాజీనామా ఆమోదం తెలపాలని స్పీకర్ పంపిన లేఖలో పేర్కొనడం చూస్తునే రాజీనామాపై స్పష్టత లేదని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రం రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పదవుల్లో ఉంటూనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న భావనతో వారు ఉన్నట్లు సమాచారం.