YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ కు సీబీఐ సహకరిస్తోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ శాఖ అధికారులు జగన్ కు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయడానికి వాయిదాల మీద వాయిదాలు అడిగి చివరకు అఫిడవిట్ దాఖలు చేయడంలేదనీ, బెయిర్ రద్దు విషయంలో కోర్టు నిర్ణయానికే వదిలివేశారు. జగన్ బెయిల్ రద్దును సీబీఐ అపోజ్ చేయకపోవడంతో అటు జగన్, రఘురామ న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు రఘురామ పిటిషన్ ను కొట్టేసింది. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో.. అక్రమాస్తుల కేసులో జగన్ వ్యక్తిగత హజరు మినహాయింపు పిటిషన్ పై జరిగిన విచారణలో సీబీఐ గత వైఖరికి భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశమవుతోంది.
YS Jagan: తీర్పుపై సర్వత్రా ఆసక్తి
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రస్తుతం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది. ఈ విచారణ నుండి సీఎంగా ఉన్న తనకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే సీబీఐ కోర్టు జగన్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ చేసిన విజ్ఞప్తి పై హైకోర్టుకు సీబీఐ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జగన్ కు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వవద్దని హైకోర్టుకు తెలిపింది. జగన్ సాక్షులు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. జగన్ హోదా పెరిగినందున సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొంది. పదేళ్లు అయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ ల దశలోనే ఉన్నాయని సీబీఐ పేర్కొంది. వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇస్తే విచారణ మరింత ఆలస్యం అవుతుందని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.