వంగవీటి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దివంగత నేత వంగవీటి మోహన రంగా పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వంగవీటి రంగాను అరాధిస్తూ అభిమానించే వారు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. రంగా తనయుడు రాధా ష్ణ కూడా రాజకీయాల్లో, తన సామాజికవర్గంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రధానంగా విజయవాడలో వంగవీటి కుటుంబానికి పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు. త్వరలో వంగవీటి రాధ వివాహం జరగనుందని సోషల్ మీడియా ద్వారా తెలియడంతో వంగవీటి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వంగవీటి ఇంట పెళ్లి బాజాలు అని తెలియడంతో రాధాకు కాబోయే భార్య ఎవరు..? ఎవరి కుమార్తెను పెళ్లి చేసుకుంటారు..? అనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది.
నర్సాపురంకు చెందిన రాజకీయ నాయకుడి కుమార్తెతో ఆయన వివాహం నిశ్చయమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. అధికారిక సమాచారం అయితే లేదు గానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ విషయాన్ని పంచుకుంటున్నారు. ఈ నెల 19న నర్సాపురంలో నిశ్చితార్దం, వచ్చే నెల 6వ తేదీన విజయవాడలో వివాహం జరగనున్నట్లు వైరల్ అవుతున్న వార్తల ద్వారా తెలుస్తొంది. రాధా పెళ్లి వార్తలపై వంగవీటి అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వంగవీటి కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.. ఆ ఫ్యామిలీతో వియ్యం అందుకునేది కూడా రాజకీయ కుటుంబమేనని సమాచారం. నరసాపురం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం అమ్మాణి, బాబ్జీ ల చిన్న కుమార్తె పుష్ప వల్లీని రాధా వివాహం చేసుకోబోతున్నారనీ, ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
1968 లో జన్మించిన రాధా .. 2004 లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడిన రాధా 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. అప్పటి నుండి రాధా రాజకీయాల్లో ఉన్నప్పటికీ మరో సారి అసెంబ్లీలో మాత్రం అడుగుపెట్టలేకపోయారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధ .. టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్ చేతిలో పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత వైసీపీ నగర అధ్యక్షుడుగా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అయితే ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయలేదు. టీడీపీలో ఎన్నికల ప్రచారానికే పరిమితం అయ్యారు.
రాధా సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. అయితే అక్కడ గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరల పోటీ చేయడానికి సిద్దపడుతున్న నేపథ్యంలో రాధా ఏ నియోజకవర్గం ఎంచుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలన్న కృత నిశ్చయంతో రాధా ఉన్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. టీడీపీ నుండే పోటీ చేస్తారా లేక జనసేన పార్టీలో చేరతారా..ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవల అనుచరులతో సమావేశం అవుతున్నట్లుగా ప్రచారం జరగడంతో రాబోయే ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినబడ్డాయి. అయితే చివరి నిమిషంలో అనుచరులతో సమావేశాన్నిరద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు రాధ. అయితే ముఖ్యమైన నేతలకు తన వివాహ వేడుకకు సంబంధించి విషయాన్ని రాధా తెలియజేసినట్లుగా చెబుతున్నారు.
వంగవీటి రాధా పెళ్లి
పెళ్లి పీటలు ఎక్కబోతున్న వంగవీటి రాధ
ఈనెల 19వ తేదీన వంగవీటి రాధా ఎంగేజ్మెంట్
వచ్చే నెల 6 వ తేదీన Vangaveeti Radha Krishna పెళ్లి
నరసాపురం కు చెందిన అమ్మాయితో వివాహం#vangaveeti #Vijayawada
— Jai Janasena Jai Pawankalyan 🔥 (@saii3456) August 16, 2023