Teachers : అనుకుంటాం గానీ పదవి ఎవరికి చేదు. అందులోనూ విజ్ఞానవంతులు ఓటు వేయడానికి ముందుకు రారు గాని పదవులు కావాలని మాత్రం ముందే ఉంటారు. పదవుల్లోని మజా అలాంటిది. రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్ లతో ఎన్నికల వేడి తారస్థాయిలో ఉంటే, ఉపాధ్యాయుల్లో మరో హీట్ ఎక్కువగా కనిపిస్తోంది. అదే శాసనమండలి స్థానాల్లో ఖాళీ అయిన వాటికి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించడం తో ఆయా స్థానాల్లో పోటీకి ప్రాముఖ్యత ఏర్పడింది.
రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే జిల్లాల నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవడంతో ఆ వేడి రాష్ట్రమంతా కనిపిస్తోంది. పోరాటంలోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా వుండే టీచర్లు ఇప్పుడు రాజకీయ వేడి లో బిజీగా కనిపిస్తున్నారు. కృష్ణ గుంటూరు జిల్లాల టీచర్ల స్థానంతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ల స్థానం ఖాళీ అయింది. కీలకమైన ఈ నాలుగు జిల్లాల వేడి ఇప్పుడు టీచర్లందరిలో కష్టంగా కనిపిస్తోంది.
Teachers : పోటీ గట్టిగానే…
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి బహుముఖ పోరు కనిపిస్తోంది. మార్చి 14న కృష్ణా గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్ధులుగా మరికొందరు రాజకీయ నేపథ్యంతో బరిలో దిగుతున్నారు. సంఘాలు అన్ని ఒకే మాట మీద లేకపోవడంతో ఎవరికి వారు పోటీలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలతో పాటు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. కృష్ణా గుంటూరు నియోజకవర్గంలో 13 వేల ఓట్లు ఉంటే, ఉభయగోదావరి జిల్లాల నియోజకవర్గంలో 17 వేల మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఎక్కడెక్కడ అభ్యర్థులు ఉన్నారు ఎవరికి టచ్ లో ఉన్నారు అనే అంశాన్ని పోటీలో ఉన్న వారు ఆరా తీస్తున్నారు.
అభ్యర్థుల కీలక అడుగులు
కృష్ణ గుంటూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మరోసారి బరిలో వుండే అవకాశం కనిపిస్తోంది. పిడిఎఫ్ ఉపాధ్యాయ సంఘం మద్దతుతో ఆయన రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. యు టి ఎఫ్, ఏపీటీఎఫ్ సంఘాలతో పాటు మరి కొన్ని సంఘాలు ఆయనకు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఏపీటీఎఫ్ గ్రూపులోని మరో వర్గం నుంచి పరుచూరి పాండురంగ వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన గత తొమ్మిదేళ్లుగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యాయ ఉద్యమంలో సైతం కీలకంగా పనిచేస్తున్నారు.
ఆయన డి టి ఎఫ్ తో పాటు పలు అధ్యాపక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న డాక్టర్ రామకృష్ణ ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు టి ఎన్ యు ఎస్ తో పాటు కొన్ని అధ్యాపక సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఎస్టియు తరఫున పి మల్లికార్జున్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా మతి కమలాకర్ రావు, కల్పలత రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎస్ సీ ఈ ఆర్ టీ డైరెక్టర్ ప్రతాపరెడ్డి సతీమణి అయిన కల్పలత కు పీఆర్టీయూ తో పాటు రాయలసీమ ఉత్తరాంధ్ర లోని పలు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.
గోదావరి జిల్లాల నుంచి
ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గం పిడిఎఫ్ అభ్యర్థిగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జి రంగంలోకి దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ టి ఎన్ యు ఎస్ గౌరవ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ సైతం పోటీలో కీలకం కానున్నారు. ఈయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న అప్పటికీ… ఆయనకు ఉన్న మద్దతు ప్రకారం మంచి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ గ్రంథం నారాయణ, ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ నుంచి అంబేద్కర్, రిటైర్డ్ టీచర్ సంఘం నుంచి ఇళ్ల సత్యనారాయణ, నవజీవన్ పాల్ వంటి వారు ఈసారి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల నుంచి రెండు నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత కాస్త విరామం దొరికిన సమయంలో టీచర్ల రాజకీయం మరింత పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.