ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ కాక కొనసాగుతూనే ఉంది. చిరంజీవి వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు మంత్రులు, మాజీ మంత్రులు స్పందించి కౌంటర్ లు ఇవ్వగా, తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వట్టర్ వేదికగా స్పందించారు. సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదనీ, ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ ఉంటుందన్నారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు విజయసాయి రెడ్డి. వాళ్ళూ మనుషులే, వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదన్నారు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.
కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ….లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారన్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారన్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారన్నారు. అలాంటి వారికి హాట్సాఫ్ చెప్పారు విజయసాయిరెడ్డి. సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్లో మాట్లాడితే కోట్లకు పడగెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటారు ఎందుకో మరి అంటూ సెటైర్ వేశారు. సినిమా పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పని చేసే మహిళల భద్రత కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఉన్నమాటంటే ఉలుకెందుకు అని ప్రశ్నించారు.
ఆంధ్రాపై పెత్తనం కోసం హైదరాబాద్లో ఉండే కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారని విమర్శించారు విజయసాయిరెడ్డి. హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్ర పన్నుతున్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.