YS Jagan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన వైఖరి ఎలా ఉంటుందో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు నిరూపించారు. ఏపీకి సంబంధించిన అంశాల విషయంలో నిర్మొహమాటంగా తన వైఖరి వెల్లడించే వైఎస్ జగన్ కరోనా నియంత్రణ టీకాల కొరత ఎదుర్కుంటున్న పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అయితే, గతంలో కంటే కాసింత ఘాటు అంశాలను ప్రస్తావించారు. ఇంకా చెప్పాలంటే ప్రశ్నించారు.
ఏపీ పరిస్థితి చెప్తూనే…
రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని ఇప్పటికే తమ ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానికి రాసిన లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే, టీకా కొరతతో ఇబ్బందులు పడుతున్నామని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం 45ఏళ్లు పైబడిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్న జగన్ 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి టీకా కొరత కారణంగా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించలేకపోయామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు అందుబాటులో ఉండటం తప్పుడు సంకేతాలు ఇస్తోందని వైఎస్ జగన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
ఆ మాట డైరెక్టుగా చెప్పేసిన జగన్
వ్యాక్సిన్ల కొరత అంటూనే ప్రైవేటుకు టీకాలు ఎలా ఇస్తారని లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధరలు వేర్వేరుగా ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు. ఒక్కో డోసుకు రూ.2వేల నుంచి 25వేలు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంతే కాకుండా ప్రభుత్వ నియంత్రణ లేకుంటే బ్లాక్ మార్కెట్కు వ్యాక్సిన్లు తరలిస్తారని ఏపీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాల వల్ల సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ప్రధానికి రాసిన లేఖలో పరిస్థితులను ఏపీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.