YS Sharmila : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. షర్మిల పొలిటికల్ ఎంట్రీపై వివిధ వర్గాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. అయితే, ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఈ ఎపిసోడ్ ను మరో కోణంలో విశ్లేషించారు. సీఎం జగన్ ఇలాకా అయిన కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై విరుచుకుపడ్డారు.
తన మార్క్ కామెంట్లతో సోము వీర్రాజు
అధికార యంత్రాంగం పూర్తిగా వైయస్సార్ పార్టీ నాయకులు చెప్పినట్లు నడుస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. తెలియజేయాలన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అధికార వైసీపీ పార్టీకి ఏజెంట్లుగా పోలీసు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు, ప్రజాస్వామ్య దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా చూడలేదు తెలిపారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు జోలికి వస్తే సహించేది లేదని వీర్రాజు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఆదినారాయణరెడ్డి సైతం…
కడప జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరి షర్మిలకు పంపకాల విషయంలో గొడవలు రావడంతో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం అని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లో సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తే తెలంగాణలో ఆయన సోదరి షర్మిల సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు అంటూ ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాలలో అన్నా చెల్లెలు బ్రాంచ్ లు ఓపెన్ చేశారంటూ ఆదినారాయణ రెడ్డి తనదైన శైలిలో విమర్శించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు ప్రస్తుతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి దోపిడీ,దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మారిందని ఆరోపించారు. మరి ఈ కామెంట్లపై అధికార వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.