రామచంద్రాపురం వైసీపీ టికెట్ పంచాయతీకి ఎండ్ కార్డ్ పడింది. నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (వేణు), రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ (బోస్) వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావం నుండి జగన్ వెంట ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇటీవల నియోజకవర్గంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో మన స్థాపంతో ఉన్నారు. వేణుకి టికెట్ ఇస్తే తాను గానీ తన కుమారుడు గానీ స్వతంత్రంగా పోటీ చేస్తామని ఇటీవల ప్రకటించారు బోస్.
అంతకు ముందు నియోజకవర్గంలో పిల్లి వర్గీయులు ఆత్మీయ సమావేశం నిర్వహించి బోస్ తనయుడికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. మంత్రి వేణు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ ఆయనకు టికెట్ ఇవ్వడానికి వీలులేదన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లికి బోస్ ను పిలిపించి మాట్లాడారు. వేణుతో కలిపి మాట్లాడతానని చెప్పగా, ఆయనతో కలిసి కూర్చునే పరిస్థితి లేదని చెప్పారు. ఈ తరుణంలో బోస్ జనసేన లో చేరనున్నారంటూ నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది. ఈ కథనాలపై ఇవేళ బోస్ స్పందించారు.
జనసేన వైపు వెళ్తున్నాను అనేది పుకారు మాత్రమేనని బోస్ స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణంలో తాను కూడా ఒక పిల్లర్ నని పేర్కొన్నారు. తాను ఎంపీగా రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని చెప్పాననీ, అది బాధాకరమైన విషయని, ఈ విషయంలో సీఎంకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. రామచంద్రాపురంలో సీఎం పర్సనల్ టీమ్ సర్వే చేసి నివేదిక ఇస్తుందనీ, ఆ సర్వే రిపోర్టు ఆధారంగానే పార్టీ చర్యలు ఉంటాయని, దానికి తాను అంగీకరించినట్లు చెప్పారు. తాను బాధతో మాట్లాడిన మాటలే కానీ పార్టీ మీద కోపం తనకు ఎప్పుడూ లేదని బోస్ పేర్కొన్నారు. బోస్ యూటర్న్ తీసుకోవడంతో రామచంద్రాపురం టికెట్ పంచాయతీకి తెరపడినట్లు అయ్యింది.
Breaking: మైహోమ్స్ సిమెంట్స్ లో ఘోర ప్రమాదం .. 5గురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి