AP Special Status: “ప్రత్యేక హోదా కష్టమని.. దేవుడి దయ.., కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు, మన అవసరం బీజేపీకి లేదు. ఉంటె అడిగేవాళ్ళం” అంటూ సీఎం జగన్ నిన్న చెప్పారు. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా దారులు మూసుకుపోతున్నట్టేనా అనే ఆందోళన పెరుగుతుంది. కానీ ఒక్కటి గమనించాలి. వైసీపీ అధికారంలో ఉన్నా.., టీడీపీ అధికారంలో ఉన్నా ప్రత్యేకహోదా ఒక రాజకీయ అంశమే తప్ప, అభివృద్ధికి, ఉద్యమానికి కాదు.. కేంద్రంలో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం లేకపోవచ్చు.. బీజేపీకి ఏపీ ఎంపీల అవసరం లేకపోవచ్చు.. బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉండవచ్చు.. కానీ హోదా అడిగే దారులున్నాయి. బీజేపీని ఇరుకున పెట్టె అవకాశాలున్నాయి. వైసిపి చేతిలో చాలా దారులున్నాయి. కాకపోతే రిస్క్ చేయాలి, చిక్కులను ఎదుర్కోవాలి..!
AP Special Status: రాజ్యసభలో బలాన్ని మర్చిపోయారా..!?
రాజ్య సభలో వైసీపీ బలం పెరగనుంది. బీజేపీ కి రాజ్యసభ సభ్యులు బలం తగ్గుతుంది. రాజ్యసభలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న ప్రాంతీయ పార్టీగా తృణమూల్ తర్వాత స్థానంలో వైసిపి నిలుస్తుంది. తృణమూల్ ఎలాగూ బీజేపీకి మద్దతు ఇవ్వదు కాబట్టి, వైసీపీ అవసరం బీజేపీకి కచ్చితంగా ఉంటుంది. కొంచెం వివరంగా చూసుకుంటే…
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ కి 95 మంది, కాంగ్రెస్ కి 34 మంది.., తృణమూల్ కి 11 మంది.., బీజేడీ కి 9 మందీ.., అన్నా డీఎంకే కి 7,
టీఆరెస్ కి 7.., వైసీపీ కి 6 .., డీఎంకె కి 6 రాజ్యసభ సభ్యులున్నారు. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా 123 మ్యాజిక్ ఫిగర్. బీజేపీకి అక్కడ మ్యాజిక్ ఫిగర్ లేదు. అంటే ఇప్పటికే బీజేపీ 28 మంది సభ్యుల అవసరంలో ఉంది.. దీనిలో ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే..,
వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్ నాటికి రాజ్యసభలో బీజేపీ బలం 75 కి పడిపోతుంది. వైసీపీ బలం 9 కి పెరుగుతుంది. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ రాజ్యసభ సభ్యులు ఉన్న పార్టీల్లో తృణమూల్ తర్వాత స్థానంలో వైసిపీ ఉంటుంది. తృణమూల్ ఎలాగూ బీజేపీకి వ్యతిరేకం కాబట్టి… వైసిపీ తమకు ఉన్న 9 మంది సభ్యుల మద్దతు కావాలి అంటే మాకు ప్రత్యేక హోదా కావాలి అని పట్టుపట్టొచ్చు.. వైసీపీకి మార్గాలు ఉన్నాయి.
గట్టిగా అడిగితే బీజేపీ చిక్కుల్లోకి.. కానీ..!!
రాజ్యసభలో ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా బీజేపీకి వైసిపి మద్దతు తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్రంలో శాసనమండలికి ఎన్ని హక్కులు, విధులు ఉన్నాయో.. కేంద్రం స్థాయిలో రాజ్యసభకు ఒకింత ఎక్కువే హక్కులు, అధికారాలు ఉన్నాయి. అక్కడ చర్చ జరిగి తీర్మానం, బిల్లు ఆమోదం పొందకుండా రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళదు.. సో.., బీజేపీకి రాజ్యసభలో వైసిపి అవసరం తప్పనిసరి. గట్టిగా అడిగి, బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. కాకపోతే జగన్ కి రాజకీయ చిక్కులు తప్పకపోవచ్చు. బీజేపీ కేంద్రంలో పగ్గాలు చేపట్టినప్పటి నుండి వ్యవస్థల్ని బాగా వాడుకుంటుంది. ఏపీపై కూడా అలా ఏదైనా వ్యవస్థల్ని ప్రయోగిస్తే అస్థిరత తప్పదు. రాష్ట్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంకా అస్థిరత ఏర్పడితే మరింత వెనక్కు వెళ్ళిపోతుంది. అందుకే బీజేపీతో కయ్యంతో కాకుండా.. వియ్యంతోనే ఏమైనా సాధించాలి. గత ప్రభుత్వం కూడా నాలుగేళ్లు కేంద్రంతో కొనగాసి.. ఏమి సాధించలేక చివర్లో చేతులెత్తేసి కేంద్రంతో కయ్యం పెట్టుకుంది. ఆ వ్యవహారాలన్నీ సీఎం జగన్ దగ్గర నుండి చూసారు, తెలుసు కాబట్టి ఇప్పుడు బీజేపీతో కయ్యానికి సిద్ధంగా లేరు.. అంచేత… ఏపీకి ప్రత్యేక హోదా దారులైతే ఉన్నాయి. కాకపోతే అడిగే రాజకీయమే లేదు. బీజేపీకి కడిగేసే సాహసమే లేదు..!