రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ యొక్క ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరపున వ్యాఖ్యలు చేసే బొత్స తన సొంత జిల్లాలో మాత్రం తేలిపోతున్నాడు. తన సొంత జిల్లా నేతలే అసలు అతను మంత్రి అన్న మాటను కూడా విస్మరిస్తున్నారు అని వాపోతున్నారు. తాజాగా ఈ బయటకు వచ్చిన ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నేత బొత్స సత్యనారాయణ అంతకు ముందు రాజధాని విషయంలో విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. ఆతర్వాత ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక పత్రికల్లో వచ్చే అబద్ధపు కథనాలు కూడా సత్యనారాయణ కౌంటర్లు ఇవ్వడం చూశాం. ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్న బొత్స సత్యనారాయణను తన సొంత జిల్లాలో మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేలు అతనిని లెక్కచేయని తీరు ఇప్పుడు చర్చకు వచ్చింది.
జిల్లాల కీలకమైన ఇద్దరు నాయకులు బొత్స సత్యనారాయణ మాటను ఖాతరు చేయడం లేదట. నువ్వు ఎక్కడైనా మంత్రి వి ఏమో కానీ ఇక్కడ మాత్రం మా రాజ్యం నడుస్తుంది అన్న రేంజ్ లో వారు వ్యవహరిస్తుండడంతో బొత్స కు ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఏపీ మంత్రి తో తీవ్రంగా విభేదిస్తున్న ఇద్దరు ఎవరంటే సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర మరియు విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి.
ఇంతకీ వారిద్దరూ అలా ప్రవర్తించేందుకు వెనుక ఉన్న ముఖ్య కారణం ఏమిటంటే తమకు రావాల్సిన మంత్రి పదవుల విషయంలో బొత్స సత్యనారాయణ గతంలో అడ్డుపుల్ల వేశారట. నియోజకవర్గంలో కూడా తమ పనిని చేసుకోనివ్వకుండా అధికారులను తొక్కి పెడుతున్నారన్న భావన వీరిలో ఉంది. అందుకే వీరిద్దరూ తీవ్రస్థాయిలో బొత్స సత్యనారాయణకు పూర్తి విరోధులుగా మారిపోయారు.
ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయనగరం కార్పొరేషన్ టిక్కెట్లు కేటాయించే వ్యవహారంలో కూడా సత్యనారాయణ తన వర్గానికి చెందిన వారికి పది టిక్కెట్లు ఇవ్వాలని కోలగట్లకు లెటర్ రాశారట. అయితే, ఆయన బొత్స ను కనీసం పట్టించుకోకపోగా…. బొత్స వర్గం తీవ్రంగా హర్ట్ అయింది. ఇక, రాజన్న దొర కూడా బొత్స సత్యనారాయణను అస్సలు లెకే చేయడం లేదు.
ఇక వీరిద్దరి మధ్య కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే విబేధాలు ఉన్నాయి. దీనికి తోడు తనకు మంత్రి పదవి రాకుండా బొత్స సత్యనారాయణ అడ్డుపడ్డారన్న కోపం కూడా రాజన్న దొరకు ఉంది. దీంతో ఆయన కూడా బొత్సను లెక్కచేయకుండా తన పనితాను చేసుకుని పోతున్నారు. ఇలా మొత్తంగా బొత్స తన సొంత జిల్లాలో హవా చలాయించలేక చతికిల పడుతున్నారనే వాదన ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో బలంగా వినిపిస్తుండడం గమనార్హం.