రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటేనే నిలబడగలం అన్నది బాబు సూత్రం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిడిపి పార్టీ ఉన్నంత బలహీనంగా దేశంలో మరే విపక్షం లేదు అన్నది వాస్తవం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో కనీస గుర్తింపుకి నోచుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఉన్నది 23 ఎమ్మెల్యేలు…. మళ్లీ వారిలో సగం మంది వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఐదు పేర్లు ఖరారు అయినట్లు కూడా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇవి బాబు చెవిన కూడా పడ్డాయి. అంతే ఉన్నఫలంగా పరిస్థితులతో సంబంధం లేకుండా వెంటనే ‘మహానాడు’ ని ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బాబు చూస్తున్నారు.
ముఖ్యంగా పార్టీ నాయకుల్లో నూతనోత్సాహం తెచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు మహానాడు తలపెట్టాలని చూస్తుండగా ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో కాకపోయినా అతి కొద్ది మంది ముఖ్య నాయకులతో మరియు ఎవరైతే వైసిపి వైపు చూస్తున్నారో వారందరినీ పిలిచి దీన్ని నిర్వహించాలని బాబు ఆలోచిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఎలాగో మహానాడు లాంటి సభకు అనుమతిని ఇవ్వదు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా ‘జూమ్’ యాప్ లో నిర్వహించాలన్న పట్టుదలతో బాబు ఉన్నాడు.
గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహానాడు జరగలేదు.ఈ ఏడాది కరోనా కారణంగా అది కూడా వాయిదా పడుతుందని అందరూ అంచనా వేయగా, బాబు మాత్రం మహానాడు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నారు.
ఇక మరోవైపు వైసీపీ వీలైనంత త్వరగా తన వైపు వచ్చే నాయకులను తమ పదవులకు మరియు పార్టీకి రాజీనామాలు చేయించి టిడిపికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గట్టి దెబ్బ కొట్టాలని పట్టుదలతో ఉందని తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీలో వచ్చేందుకు ఆసక్తి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల లిస్ట్ మొత్తం వైసీపీ రెడీ చేసుకుంది.పార్టీలో చేరేందుకు ఏ క్షణమైనా పిలుపు రావచ్చని, మీరంతా సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే వారికి సమాచారం అందినట్టు తెలుస్తోంది.
ఇక విషయాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు పార్టీ మారే ఆలోచన ఉన్న నాయకులందరికీ ఫోన్ చేసి బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బాబు కి ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఒక్క మహా నాడే పెద్ద దిక్కులా కనిపిస్తుంది. దాని ద్వారానే వైసిపి దూకుడుకు చెక్ పెట్టాలని బాబు భావిస్తున్నాడు.