175 లో 151 సీట్లు… ఓ తిరుగులేదు.., జగనుడికి ఎదురే లేదు అనుకోని ఏడాదయ్యింది…!
175 లో 23 స్థానాలు… ఇక ఎదగడం కష్టమే… చంద్రబాబుకి రోజులు లేవు అనుకుని ఏడాదయ్యింది…!
ఆ 151 … 154 కి చేరాయి. ఈ 23 .. 20 కి పడిపోయాయి. ఆహా అనుకున్నదే జరుగుతుంది, జగనుడికి ఎదురులేదు…, చంద్రబాబుకి భవిత లేదు అనుకున్నారంతా…! మరి నిజంగా జగన్ కి ప్రతిపక్షం లేదా..? చంద్రబాబుకి మద్దతు లేదా..? వైసిపి కి ఆకాశమే హద్దా..? టీడీపీ ఇక పాతాళానికేనా…? అదే చెప్పుకుందాం..!! కాసేపు వైసిపి, టీడీపీ అనే మాటని పక్కన పెట్టేసి జగన్ ప్రభుత్వం, ఏపీ హైకోర్టు అని చెప్పుకుందాం. ప్రతిపక్షం చితికిలపడితే పత్రికలే ఆ బాధ్యత మోయాలి, పత్రికలూ పలుచబడితే… ఇక కోర్టులే దిక్కు. అవును, ఇప్పుడు జగన్ వ్యతిరేక వర్గానికి కోర్టులే దిక్కు.
ఏడాదిలో నేర్చుకున్నదేమిటి…?
గత ఏడాది మే 23 న జగనుడి జయకేతనం ఎగురవేశాడు. మే 31 కుర్చీ ఎక్కాడు. నిజానికి జగన్ గెలుపు ఏకపక్షం. దేశంలో ఒకరకైమా చారిత్రిక విజయం సాధించారు ఆయన. దీన్ని కొనసాగించి ఉంటె ఇప్పుడు ఈ మాటలు చెప్పుకోవాల్సి వచ్చేవి కాదు. తనకు ఎదురే లేదు. పత్రికలూ ఏమైనా రాస్తే ఎల్లో మీడియా అని ఎదురు దడి చేద్దాం… చంద్రబాబు ఏమైనా అంటే ఎమ్మెల్యేలను లాగేసి ఒంటరి చేసేయొచ్చు అనుకున్నాడు. నిజమే… మరి కోర్టులు ఏమైనా అంటే, కోర్టులు జగన్ ని ధిక్కరిస్తేనో.. ఈ పాయింట్ జగన్ ఆలోచించలేదు. పాపం ఈ ఒక్క పాయింట్ ఇప్పుడు జగన్ కి చుక్కలు చూపిస్తుంది. చుక్కలే కాదు అన్ని దిక్కులు చూపిస్తుంది.
జులై 17 న తొలి దెబ్బ పడింది. విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో సమీక్షలు వద్దు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. అక్కడి నుండి వరుసగా జగనుడికి అన్ని దిక్కుల్లోనూ, చుక్కలు చూపిస్తుంది కోర్టు. కానీ మార్పు లేదు, ఏడాదిలో పాఠం నేర్వలేదు.
తత్వం తెలుసుకోకుంటే భవిత కష్టమే…!
జగన్ మంచి నాయకుడు. ఆ మాటలో తిరుగులేదు. అత్యంత తెలివైన, మొండి ధైర్యం ఉన్న నాయకుడు. కానీ పాలకుడు కాదు, ప్రతి నాయకుడు పాలకుడు కాలేడు. జగన్ లో నాయకున్ని చుసిన జనాలు అధికారం ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్ లో పాలకుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నారు. మొండితనం, అదే ధైర్యం, తెగువ ఉన్నాయి కానీ తత్వం తెలుసుకోవట్లేదు. చిన్న చిన్న అంశాల్లో మొండి తనానికి వెళ్లి, కోర్టుల చేత చివాట్లు తినిపించుకోవడం జగన్ కు ఎలా ఉందొ కానీ, ఓట్లేసిన అభిమానులకు తలవంపులుగా భావిస్తున్నారు. జగన్ వయసు ఇప్పుడు కేవలం 47 ఏళ్ళు మాత్రం మరో పాతికేళ్ళు చురుకైన రాజకీయాలు చేయగలరు. అందుకు తగిన లక్ష్యాలు ఆయనకు ఉన్నాయి. కానీ వాటిలో ప్రజామోదం, న్యాయం వాటా మాత్రం తక్కువయ్యాయి. ఇదే కొనసాగితే, తత్వం ఎరుగక ముందడుగు వేస్తే భవిత కష్టమే.
కోర్టుని ఎదుర్కోలేరా… అంత కష్టమా…?
కోర్టులను ఎదుర్కోవడం అంత కష్టమా…? కానే కాదు. సరైన వాదన, సమర్ధనీయమేనా న్యాయ విభాగం ఉంటె కోర్టుల్లో ఈ తలవంపులు వచ్చేవే కాదు. నిజానికి గతం లో ఏ ప్రభుత్వానికి లేనట్టుగా జగన్ చుట్టూ ఇప్పుడు సలహాదారులు ఎక్కువగా చేరారు. ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్ కెళ్ళాం రెడ్డి, ఇలా చెప్పుకుంటే చాల మంది. ఇలాంటి తల పండిన మేధావులు సైతం ఉన్నారు. వీరికి తోడుగా ఇటీవల మరో సలహాదారుడు సాక్షి లో రెసిడెంట్ ఎడిటర్ గా చేసిన ధనుంజయరెడ్డిని తెచ్చి పెట్టుకున్నారు. నెల నెల రూ. లక్షల్లో వేతనాలు పొందుతున్నారు. మరి వీళ్ళు ఎందుకున్నట్టు? ఏంసలహాలు ఇస్తున్నట్టు?? వారికి ముందు తెలియదా?? ఏం చేస్తున్నారు ? ఎక్కడెక్కడ.., ఏం సమాధానాలు చెప్పుకోవాలి? అనేది ముందుగానే పూర్తిగా సిద్ధమై రంగంలోకి దిగాలి కదా…! అదేమి లేక, ముందుచూపు వ్యవహారాలూ లేక చేసేసి, కోర్టుల ముందు చివాట్లు తినడం ఇప్పటికిప్పుడు జగన్ కి పెద్దగా నష్టం చేయకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. అందుకే ఏడాది విజయానికి గుర్తుగా కోర్టులు వారికి కొన్ని జ్ఞాపకాలు మిగిల్చాయి. అందుకే ప్రస్తుతానికి జగన్ చేసుకుంటున్న స్వీయ తప్పిదాలు కోర్టుల రూపంలో విపక్షంగా మారాయి.