రైతులకు ఊరట..పక్కా వ్యూహాత్మకంగా
నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయాలని ఆదేశాలు
అమరావతి నుంది పరిపాలనా రాజధాని విశాఖలకు తరలించేందుకు ముహూర్తాలు సిద్దం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. అధికారం చేపట్టిన నాటి నుండి అమరావతిలో జరిగి ఇన్ సైడర్ ట్రేడింగ్ పైనే మాట్లాడుతూ వచ్చిన ప్రభుత్వం..ఇప్పుడు అక్కడ డెవలప్ మెంట్ పైన ఫోకస్ చేసింది. అమరావతిలో ప్రస్తుతం ఏయేదశల్లో నిర్మాణాలు ఉన్నాయో అధికారులను అడిగితెలుసుకున్న సీఎం..వాటిని పూర్తిచేసే కార్యాచరణపై అధికారులకు కీలక సూచనలు చేసారు. దీనికి తగినట్లుగా నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని ఆదేశించారు. ఆర్థికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ప్లాన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి అమరావతి డెవలప్ మెంట్ అధికారులకు సూచించారు. అదే విధంగా కొద్ది కాలంగా వివాదాస్పద చర్చకు కారణమైన హాపీ నెస్ట్ బిల్డింగులను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. దీని వెనుక ముఖ్యమంత్రి పక్కా వ్యూహాత్మకంగా..ప్రణాళికా బద్దంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. కానీ, అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న స్థానిక రైతులకు మాత్రం కొంత ఉపశమనం కలిగించే నిర్ణయాలుగానే భావించాల్సి ఉంటుంది.
అమరావతి నిర్మాణాలు పూర్తి చేయండి…
అమరావతి రాజధానిగా గత ప్రభుత్వం ప్రారంభించి మధ్యలో నిలిపివేసిన భవనాలు..నిర్మాణాల పైన ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.గత ప్రభుత్వం అమరావతిలో ఎటువంటి డెవలప్ మెంట్ చేయలేదని కేవలం గ్రాఫిక్స్ నే చూపిస్తూ..ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు ఆరోపిస్తూ వచ్చారు. అదే విధంగా జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఈ 15 నెలల కాలంలో అమరావతిలో ఎటువంటి కొత్త నిర్మాణాలు ప్రారంభించలేదు. మధ్యలో నిలిచిపోయిన వాటి గురించి ఇప్పడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థితి గతులను అడిగి తెలుసుకోవటం తో పాటుగా అక్కడ చేసిన ఖర్చు వివరాలు..తీసుకొచ్చిన రుణాల పైన అధికారుల నుండి వాకబు చేసారు. అక్కడ మధ్యలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్దికంగా అందుకు ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని చెప్పటం ద్వారా తాను అమరావతి డెవలప్ మెంట్ కు వ్యతిరేకం కాదనే సంకేతాలను సీఎం ఇచ్చారు. ఇక, హ్యాపీనెస్ట్ వంటి అంశాల్లోనూ సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. వాటిని సైతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు అమరావతిలో భారీగా ఖర్చు చేసి దాదాపు 80 శాతం నిర్మాణాలు పూర్తి చేసామని..వాటి పరిస్థితి ఏంటంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో..ఇక వారికి అవకాశం ఇవ్వకుండా జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది.
జగన్ నిర్ణయం వెనుక పక్కా వ్యూహం…
ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలు..ఇచ్చిన ఆదేశాల వెనుక పక్కా వ్యూహం కనిపిస్తోంది. ఇప్పటికే అమరావతి నుండి పరిపాలనా రాజధానిని తరలింపును వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు..అమరావతి జేఏసీ కోర్టును ఆశ్రయించాయి. అందులో భాగంగా…సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించి దాఖలైన పిటీషన్ లో హైకోర్టు ఇప్పటి వరకు అమరావతిలో దాదాపు 52 వేల కోట్లు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారని.. ఆ మొత్తం ప్రజల సొమ్మును ఎలా సద్వినియోగం చేస్తారు..ఇప్పుడు రాజధాని మార్పు ద్వారా అది దుర్వినియోగం చేస్తారా అని ప్రశ్నించింది. అయితే, సీఆర్డీఏ చట్టం రద్దు పైన పిటీషన్ దాఖలు సమయంలో పిటీషనర్ తరపు న్యాయవాది చెప్పిన లెక్కలతో ప్రభుత్వ న్యాయవాది విభేదించారు. దీంతో..ఆడిటర్ జనరల్ పూర్తి సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ జరిగిన ఖర్చు పైన ఆరా తీయటంతో పాటుగా..అక్కడ చేసిన ఖర్చు నిరుపయోగం కాకుండా సద్వినియోగం చేసేలా ఆదేశాలిచ్చారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం కోర్టులో నివేదించే అవకాశం ఉంది. ఇక, అమరావతి కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉంటే భూములిచ్చిన తాము భారీగా నష్టపోతామనే రైతులకు సైతం ఉపశమనం కలిగేలా అక్కడ నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా అమరావతి సమగ్రంగా డెవలప్ చేసేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికలతో రావాలని సీఎం నిర్దేశించారు. ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారం పైన నిరసనలు..రాజకీయంగా విమర్శలు..కోర్టులో వివాదాల నడుమ ముఖ్యమంత్రి తీసుకున్న తాజా నిర్ణయాలు కొత్త మలుపుకు కారణం అయ్యే అవకాశం కనిపిస్తోంది.