తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ 2017 ఏప్రిల్ 19న దేశ రాజధానిలో కుటుంబ సభ్యులతో ధర్నా చేస్తున్న పెహ్లూఖాన్ తల్లి అంగూరి బేగం
హిందుత్వ మూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాజస్థాన్ కి చెందిన పెహ్లూ ఖాన్ మీద రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రచురించిన వార్త “ఆధారరహితమని” ఆ ప్రభుత్వం దానిని కొట్టిపారేసింది. బహుశా కాంగ్రెస్ ప్రభుత్వమే వాస్తవాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది.
2017 ఏప్రిల్లో అల్వార్లో గో రక్షక మూక చేసిన దాడిలో ప్రాణాలు వదిలిన పెహ్లూ ఖాన్ మీద రాజస్థాన్ గో జాతి (వధ నిషేధం, తాత్కాలిక ఎగుమతి నియంత్రణ) చట్టం, 1995 ప్రకారం అభియోగ పత్రం దాఖలు చేశారు అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్ట్ చేసింది.
ఈ వార్త వచ్చిన కొన్ని గంటలకే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక గెహ్లాట్ దీన్ని ఖండించారు. 2018 డిసెంబర్లో దాఖలు చేసిన అభియోగపత్రంలో పెహ్లూ ఖాన్ పేరు లేదని ఆయన పేర్కొన్నారు.
అయితే ఆ అభియోగపత్రంలో ఒక భాగాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రచురించింది. అందులో నిందితుడిగా పెహ్లూ ఖాన్ పేరు కనీసం రెండు సార్లు పేర్కొన్నారు.
పెహ్లూ ఖాన్ పేరు తరువాత తొలగించామని ఇప్పుడు రాజస్థాన్ పోలీసులు చెబుతున్నారు. వారు చెబుతున్న కారణం “చనిపోయిన వ్యక్తిని విచారించలేము” అని. అయితే పెహ్లూ ఖాన్ కుమారులు ఇద్దరి పేర్లు అలాగే ఉన్నాయి.
ఛార్జ్షీట్లో ఒక భాగం , Credit: Indian Express
“దేశంలో ఏ మూల జరిగే ఎటువంటి మూక హత్యకైనా కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా వ్యతిరేకం.” అని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. అలాగే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దర్యాప్తును పునఃపరిశీలిస్తామని చెప్పారు. అయితే నిందారోపణలని బిజెపి మీదకి నెట్టివెయ్యడంతో కాంగ్రెస్ పరిశుద్ధురాలు అయినట్లు కాదు. తమకి సైద్ధాంతిక నిబద్దత ఉంది అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాజస్థాన్ లోనూ, మిగతా రాష్ట్రాల లోనూ ఎలా పనిచెయ్యబోతున్నదో అందరు గమనిస్తుంటారు అని ఆ పార్టీ గుర్తెరిగితే మంచిది.
పెహ్లూ ఖాన్ని నిందితుడిగా చేర్చటం అనేది మూక హత్యలకి సంబంధించి నడుస్తున్న తిరోగమనానికి ఒక నిదర్శనం. మూక హత్యలకి సంబంధించి బాధితులనే చివరికి నిందితులుగా పేర్కొంటున్నారు.
మూక హత్య జరిగిన సత్వరమే రాజస్థాన్ పోలీసులు పెహ్లూ ఖాన్, అతని కుమారుల మీద రాజస్థాన్ గో జాతి చట్టం కింద కేసు నమోదు చేశారు. జాతీయ రహదారి మీద దాడికి గురయ్యిన పెహ్లూ ఖాన్ అతని సహచరులు తాము అక్రమ రవాణ చెయ్యటంలేదని సంబంధిత పత్రాలు చూపించినా కూడా లాభం లేకపోయింది.
పెహ్లూ ఖాన్ చనిపోయిన రెండు రోజుల తరువాత, ఏప్రిల్ అయిదవ తేదీన కాని అతనిపై మీద దాడి చేసిన వారి మీద హత్యానేరం మోపలేదు. వారి ఆచూకి తెలిపినవారికి బహుమానం ప్రకటించారు. తన చావుకి ఆరుగురు గోరక్షకులు కారణం అని వారి పేర్లు పెహ్లూ ఖాన్ మరణవాంగ్మూలంలో ఇచ్చిన తరువాత కూడా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు. వీళ్ళు విశ్వ హిందూ పరిషద్, భజరంగ్ దళ్ సభ్యులు అన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు గురించి ప్రజాబాహుళ్యంలో ఆగ్రహం వెల్లువెత్తడంతో పోలీసులు మొదటి దఫా అరెస్టులు చేశారు. అయితే సెప్టెంబర్, 2017 నాటికి ఆ ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న ఒక గో సంరక్షణశాల ఉద్యోగుల వాంగ్మూలాల ఆధారంగా, కాల్ రికార్డుల ఆధారంగా ఆరుగురు నిందితుల మీద పోలీసులు కేసుని ఉపసంహరించారు. అప్పటికే కేసు విచారణ రెండు సార్లు చేతులు మారింది.
పెహ్లూ ఖాన్ని చంపిన వాళ్ళ మీద పెట్టిన కేసు ఒక పక్క నీరుకారుతుండగా , మరొక పక్క పెహ్లూ ఖాన్, అతని సహచరులు పశువులని అక్రమ రవాణా చేస్తున్నారు అని నిరూపించటానికి రాజస్థాన్ పోలీసులు తమ శక్తిసామర్ధ్యాలు అన్నిటినీ ధారపోస్తున్నట్టు కనిపిస్తున్నది. పెహ్లూ ఖాన్ ఇద్దరు కుమారుల మీదే కాకుండా పెహ్లూ ఖాన్తో పాటు మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన అతని ఇద్దరి సహచరుల మీద కూడా క్రితం సంవత్సరం కేసు నమోదు చేశారు.
హత్య చేసిన నిందితులు మాత్రం జామీను తీసుకుని స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
చాలా రాష్ట్రాలలో మూక హత్యలు మూడు కారణాల వల్ల అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. మొదటిది, గో సంరక్షణ చట్టాల కారణంగా తాము ఏమి చేసినా ఫరవాలేదన్న వాతావరణం ఒకటి ఏర్పడింది. రెండవది, హత్యలు, మెజారిటీ మత విద్వేషం కన్నా పశువుల అక్రమ రవాణా, గో మాంస భక్షణే సీరియస్ నేరాలన్న విధంగా పోలీసులు వ్యవహరించడం. మూడవది, మూక హత్యలకి పాల్పడేవారికి దొరుకుతున్న రాజకీయ మద్దతు.
బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో దాద్రి మూక హత్య నిందితులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సభలకి హాజరవుతుంటారు. అయితే మూక హత్యలని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ స్థాయికి దిగజారకుండా ఉండవలసిన అవసరం ఉంది.
మొన్న నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మధ్య ప్రదేశ్లో అధికారం హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ హింసకి పాల్పడే గో రక్షకులని శిక్షించే చట్టం ఒకదానిని ప్రతిపాదించింది. తమను అనేవారు లేరని చెలగేరిపోతున్న గో రక్షకులని కట్టడి చెయ్యడంలో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే రాష్ట్ర పోలీసులు ఈ చట్టాన్ని శ్రద్ధగా అమలు చేస్తారా?
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో గో హత్యకి సంబధించి ప్రత్యేక చట్టం ఉన్నా కూడా 2007 నుండి 2016 వరకు గో హత్యలకు పాల్పడ్డారు అనే ఆరోపణ మీద 22 మంది మీద అమానుషమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు.
స్క్రోల్.ఇన్ రిపోర్ట్ చేసినట్టు కమల్ నాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నెలలోనే ఖండ్వా జిల్లాలో ముగ్గురు ముస్లింల మీద ఈ చట్టం కింద కేసు నమోదు చేశారు. తరువాత వారి మీద జాతీయ భద్రతా చట్టం కింద పెట్టిన కేసుని తొలగించారు కానీ గో హత్య చట్టం కింద ఏడేళ్ళు జైలుపాలయ్యే అవకాశం ఉంది.
పదిహేనేళ్ళ బిజెపి పాలన పోలీసు శాఖని కాషాయీకరణ చేసేసింది అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
“ పోలీసులు, ఇతర అధికారులు పూర్తిగా సంఘీయుల ఆలోచనా ధోరణిలోకి వెళ్ళిపోయారు.” అని ఖండ్వాలోని కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ స్క్రోల్.ఇన్ కి చెప్పారు. వీధిలో ఒక గోడపత్రిక అతికించినందుకు 2017 డిసెంబర్లో ఆయన మేనల్లుడి మీద జాతీయ భద్రతా చట్టం కింద కేసు పెట్టారు. నెల రోజులు జైలులో గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదల అయ్యాడు.
కొన్ని దశాబ్దాల నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఇతర కాషాయ సంస్థలు వేళ్ళూనుకుపోయిన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వను తలకెక్కించుకున్నది కేవలం బిజెపి వారు మాత్రమే కాదు. మధ్య ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీ కూడా హిందుత్వనే తమ ప్రచారాస్త్రంగా వాడుకుంది.
గత కొన్ని సంవత్సరాలుగా మెజారిటీ మతవాదం కేవలం బిజెపి పార్టీ ఎజెండా స్థాయిని దాటి పాలకవర్గ ఇంగిత జ్ఞానంగా తయారయ్యింది. పోలీసు వ్యవస్థ దగ్గర నుండి బ్యూరోక్రసీ, విద్యా సంస్థల వరకు అన్ని వ్యవస్థలలోనూ వేళ్ళూనుకుంది. మైనారిటీలను నెత్తిన పెట్టుకుని మోస్తున్నది అన్న ఆరోపణలతో కుదేలయిన కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ ఓటర్ల నుండి దూరంగా జరుగుతున్నది. కాంగ్రెస్ “ముస్లిం పార్టీ” అని బిజెపి చేసిన ఆరోపణని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత సంవత్సరం తీవ్రంగా ఖండించారు.
లోక్ సభ ఎన్నికలలో ఘోర పరాభవం తరువాత కాంగ్రెస్ పార్టీ అక్కడొక మూల, ఇక్కడొక మూల మాత్రమే అధికారంలో ఉంది. తాము లౌకిక విలువలకూ, మైనారిటీల పరిరక్షణకి కట్టుబడి ఉన్నామన్న కాంగ్రెస్ వాదన నిగ్గు తేలేది ఈ ప్రాంతాలలోనే.
మెజారిటీ మతవాద హింసని శిక్షించడం ద్వారా తమ నిబద్దతని చాటుకునే అవకాశం కాంగ్రెస్కి ఉంది. కర్ణాటకలో పిల్లలకి చాక్లెట్లు పంచిపెట్టినందుకు 26 సంవత్సరాల గూగల్ సంస్థ ఉద్యోగిని కొట్టి చంపారు. మధ్యప్రదేశ్లో గో మాంసాన్ని తీసుకువెళుతున్నారు అనే ఆరోపణ మీద కొద్ది వారాల క్రితమే ముగ్గురు ముస్లింలపై దాడి చేశారు. రాజస్థాన్లో పెహ్లూ ఖాన్, అతని కుమారుల మీద పెట్టిన కేసు గురించి వివాదాన్ని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తేలికగా కొట్టిపారేస్తున్నది. ఇలాంటి సందర్బాలలోనే కాంగ్రెస్ నిబద్ధత ఎంతో నిర్దారణ అయ్యేది.
-ఇప్సితా చక్రవర్తి
స్క్రోల్.ఇన్ వెబ్సైట్ సౌజన్యంతో