నాలుగయిదు ఏళ్లుగా ఆవు ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతోంది. గోమాత సంరక్షణ పేరుతో మనుషులను కొట్టి చంపడాన్ని అలా ఉంచితే, ఆవు వ్యర్ధాలతో చేసే వ్యవసాయం అన్ని సమస్యలకూ పరిష్కారం అని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. సుభాష్ పాలేకర్ లాంటి వారు దేశం అంతా ఈ సందేశం మోసుకువెళుతున్నారు. గోమూత్రాన్ని సర్వరోగ నివారిణిగా చిత్రిస్తున్నారు. కేంద్రప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారికంగా గోమూత్రం ధెరపీని ప్రచారం చేస్తున్నది. దానికి ప్రాతిపదికగా ఎలాంటి పరిశోధనా ఫలితాలనూ మాత్రం చూపించడం లేదు.
తాజాగా గోమూత్రం వల్ల గ్రీన్హౌస్ ఎఫెక్ట్ హెచ్చుతుందని ఒక పరిశోధనలో బయటపడింది. గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అంటే భూ వాతావరణం వేడెక్కడం. విచక్షణా రహితంగా పెట్రోలియం ఉత్పత్తులను మండిచినందువల్ల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువుల శాతం పెరగడం ఇందుకు కారణం.
గోమూత్రం వల్ల వాతావరణంలో నైట్రస్ ఆక్సైడ్ శాతం పెరుగుతుందని పరిశోధనలో తేలింది. కార్బన్ డై ఆక్సైడ్ కన్నా నైట్రస్ ఆక్సైడ్ 300 రెట్లు ఎక్కువ గ్రీన్హౌస్ ఎఫెక్ట్కు కారణమవుతుంది. ఫశుసంపద ఎక్కువగా ఉన్న కొలంబియా, అర్జెంటీనా, బ్రెజిల్, నికరాగువా, ట్రినాడాడ్, టొబాగో దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. దీని ఫలితాలను ప్రముఖ సైన్స్ జర్నల్ ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ప్రచురించారు.
పశుసంపదకు ప్రాధాన్యమిచ్చే దేశాల్లో ఇండియాలో కూడా ఒకటి. పశువుల నుండి వెలువడే మీధేన్ వాయువు కూడా గ్రీన్హౌస్ ఎఫెక్ట్కు దోహదం చేసేదే. అయితే ఆవు మూత్రం భూతాపానికి దోహదం చేస్తున్నదన్న విషయం ఇంతవరకూ తెలియదు. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గోమూత్రం తీసుకుని సారం తగ్గిన భూముల్లో, పచ్చిక మైదానాల్లో చల్లారు. ఆ భూముల నుంచి నైట్రస్ ఆక్సైడ్ మూడు రెట్లు ఎక్కువ విడుదల అవుతున్నట్లు బయటపడింది. కొలంబియాకు చెందిన అంతర్జాతీయ ఉష్ణమండల వ్యవసాయ పరిశోధనా సంస్థ ఈ పరిశోధన నిర్వహించింది.
ఇండియాలో సాంప్రదాయబధ్దంగా ఆవు పేడ, మూత్రం కలిపి పొలాల్లో చల్లుతారు. దేశ భూభాగంలో దాదాపు 30 శాతం సారం తగ్గిన భూములేనని 2012లో ఇస్రో ఉపగ్రహం ద్వారా నిర్వహించిన ఆధ్యయనంలో తేలింది. సారవంతమైన భూముల్లో కన్నా సారం తగ్గిన భూముల్లో నైట్రస్ ఆక్సైడ్ ఎక్కువ విడుదల అవుతున్నట్లు తేలింది. సారవంతమైన భూముల్లో పెరిగే మొక్కలు కొంత నైట్రోజన్ సంయోగాలను పీల్చుకుని మిగతా వాయువును మాత్రమే వాతావరణంలోకి వదలడం ఇందుకు కారణం.
2012 నాటి పశుసంపద లెక్కింపు ప్రకారం దేశంలో పశుగణం నుంచి వచ్చే పేడ, మూత్రం లెక్కలు ఉన్నాయి గానీ, ఇండియా నుంచి విడుదలయ్యే నైట్రస్ ఆక్సైడ్లో గోమూత్రం వాటా ఎంతన్నది తెలియదని ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం, బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ ఎన్. రఘురామ్ పేర్కొన్నట్లు ‘ద హిందూ’ దినపత్రిక తెలిపింది.