భారత వాయుసేన మిరేజ్ 2000 విమానం. photo courtesy: AFP
ఫిబ్రవరి 14 పుల్వామా దాడి నేపధ్యంలో భారతీయ వైమానిక దళం సరిహద్దుకి అవతల ఎదురుదాడి జరిపింది. ఈ దాడి యుద్ధ సంబంధిత ఎత్తుగడలు(Sub-Conventional Warfare Tactics), రక్షణ వ్యూహానికి సంబంధించి ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది అని పొగడ్తలు అందుకుంది. పాకిస్థాన్ లో జైష్-ఏ-మహమ్మద్కి చెందిన అనుమానిత శిక్షణా కేంద్రం లక్ష్యంగా మిరాజ్ 2000కి చెందిన 12 యుద్ధవిమానాల సమూహం ఈ దాడిలో పాల్గొన్నది. భారతదేశ విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే దీనిని సైనికేతర, ముందస్తు దాడిగా అభివర్ణించారు.
“సైనికేతర” అంటే ఆ లక్ష్యం పాకిస్థాన్ రాజ్యం కానీ, దాని సైనిక బలగాలు కానీ కాదు, దాని లక్ష్యం రాజ్యేతర శక్తులు అనేది నిర్వివాదాంశం. కానీ మనం ఈ సైనికేతర, “ముందస్తు” దాడి అంటే ఏంటో పరికించి చూద్దాము.
“అన్ని అంతర్జాతీయ చట్టాలని” పాటించాము అని పేర్కొన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ వారి “బహు చక్కగా లిఖించిన ప్రకటన” కి ఆమోదముద్ర వేయటంలో కొంతమంది వ్యాఖ్యాతలు అనవసరపు తొందరపాటు పాటించారు. కాకపోతే వారు అమెరికా సృష్టి అయిన ముందస్తు ఆత్మరక్షణ దాడిని సాంప్రదాయిక అంతర్జాతీయ చట్టాల చేత గుర్తింపు పొందిన ముందుజాగ్రత్త ఆత్మరక్షణ దాడిగా పొరబడ్డారు. పొరబడి దానిని ముందస్తు ఆత్మరక్షణ హక్కుగా పేర్కొన్నారు.
ఈ హక్కు అమలుచేయ్యాలంటే ముందుగా మూడు నిబంధనలకి లోబడి పరిస్థితి ఉండాలి. తప్పనిసరిగా దాడి జరిగే అవకాశం ఉండటం మొదటిది. అటువంటి దాడిని తిప్పికొట్టటానికి సైన్యం అవసరం అవశ్యం అవ్వటం రెండవది. సమతౌల్యపు బలప్రయోగం మూడవది.
2016లో “సర్జికల్ స్ట్రైక్” జరిగిన వెంటనే యతీష్ బెగూర్ వీటి మధ్య వ్యత్యాసం గురించి ఉపయోగకరమైన వివరణ ఇచ్చారు. ముందుజాగ్రత్త ఆత్మరక్షణ దాడి అనేది 1837 నాటి కేరోలిన్ సంఘటన నుండి సాంప్రదాయ అంతర్జాతీయ చట్టంలో నియమంగా ఉంది అని ఆయన చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ మంత్రి డేనియల్ వెబ్ స్టర్, బ్రిటిష్ విదేశాంగ మంత్రి మధ్య జరిగిన సంభాషణ అటువంటి హక్కు దఖలు పడటానికి అవసరమైన చట్టపరమైన అంశాలు గురించి వివరిస్తుంది. ఆ అంశాలనే తరువాటి శతాబ్దాలలో పునరుద్ఘాటించారు. అదేంటంటే:
“ తక్షణ ఆత్మరక్షణ, ఆత్యయిక పరిస్థితి, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోవటం, యోచించే సమయం లేకపోవటం అనే అవసరాలని రుజువు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. అంతేకాక అధికారులు- ఆ క్షణం అవసరాన్ని బట్టి వారికి ఇతర భూభాగంలోకి వెళ్ళే అధికారం దాఖలు పడింది అనుకున్నా…- పరిధిని దాటి ప్రవర్తించలేదు అని రుజువు చెయ్యవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఏ అవసరం బట్టి అవసరం పడింది అని ఆ ఆత్మరక్షణని సమర్ధించారో ఆ ఆత్మరక్షణ ఆ అవసరానికి లోబడే ఉండాలి.”
అమెరికా రక్షణ అవసరాలకి ఈ సిద్ధాంతాన్ని అన్వయించేందుకు ఈ ముందస్తు ఆత్మరక్షణ దాడి నియమం చక్కగా పనికివచ్చింది.. “ప్రాధమికంగా చూస్తే ఈ ముందస్తు ఆత్మరక్షణ దాడి అనేది దాడి అత్యావశ్యకత స్థాయిని మాత్రమే తక్కువ స్థాయిలో ఉంచటం కాకుండా బలప్రయోగాన్ని ఎప్పుడు ఉపయోగించవచ్చు అనే వాస్తవిక నిర్ణాయక స్థాయిని కూడా తక్కువ స్థాయిలోనే ఉంచుతున్నట్టు కనబడుతోంది” అని జేమ్స్ బేకర్ పేర్కొన్నారు.
9/11 తరువాత అమెరికా 2002లో రూపొందించిన జాతీయ రక్షణ వ్యూహం ఈ కొత్త సిద్ధాంతాన్ని ముందస్తు ఆత్మరక్షణ దాడి స్థాయికి పెంపొందించింది. ముందు జాగ్రత్త ఆత్మరక్షణకి ఉన్నట్టు దీనికి సాంప్రదాయిక అంతర్జాతీయ చట్టంలో ఎటువంటి చట్టబద్ధత లేదు.
విదేశాంగ శాఖ ప్రకటనలో ఈ వ్యత్యాసాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కానీ ముందస్తు ఆత్మరక్షణ దాడి జరిపినట్టు అందులో సూచించినదానికి ఆ దాడి గురించి వచ్చిన నివేదికలకి ఎటువంటి పొంతన లేదు. బయటకి వచ్చిన నివేదికల ప్రకారం పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవటానికి అనుమతి భారతీయ వైమానిక దళానికి ఆ మరుసటి రోజునే లభించింది. దాడికి భారతీయ వైమానిక దళం సిద్ధమైన తీరు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ఇచ్చిన సమాచారం అన్నీ ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే ఇంత జరిగిన తరువాత కూడా విదేశాంగ కార్యదర్శి ప్రకటనలో ఎక్కడా కూడా ప్రతీకార చర్య గురించి కానీ రాజ్యేతర శక్తుల నుండి సాయుధ దాడులకి వ్యతిరేకంగా భారతదేశానికి ఉన్న ఆత్మరక్షణ హక్కు గురించి ఎటువంటి మాటా లేదు. ఆ ప్రకటన ఏమంటుంది అంటే:
“ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో మరొక ఆత్మాహుతి దాడికి జైష్-ఏ-మొహమ్మద్ ప్రయత్నిస్తుంది అని, అందుకోసం ఆత్మాహుతి జిహాదీలకు శిక్షణ ఇస్తుంది అని విశ్వసనీయ ఇంటలిజెన్స్ అందింది. ప్రమాదం తప్పదని తేలిన నేపధ్యంలో ముందస్తు ఆత్మరక్షణ దాడి అత్యవసరం అయ్యింది.”
ఈ సంభావ్య ఆత్మాహుతి దాడుల గురించిన వివరాలు ఏవి ప్రజలకి అందుబాటులో లేవు. ఆ ప్రకటనలో పేర్కొనట్టు ఒకే ఆత్మాహుతి దాడి వివిధ ప్రదేశాలలో ఎలా సాధ్యమో మనకి తెలియదు. దేశ రక్షణకి సంబంధించినంత వరకు రాజకీయ సిద్ధాంతాలు , అనుబంధాలు దాటి ఆలోచించాలి అనేది నిర్వివాదాంశం. అదే సమయంలో దేశ రక్షణకై మన పాలకులు తీసుకునే చర్యలు యుద్ధం చెయ్యటం మీద అంతర్జాతీయంగా ఉన్న పరిమితులని జవదాటకపోవడం కూడా అత్యవసరం.
“ప్రతీకారం”, ముందస్తు చర్య” రెండు ఎట్టి పరిస్థితులలోనూ సమానార్ధకాలు కావు. కొన్ని సందర్భాలలో ప్రతిబంధక ప్రభావం ప్రతీకార చర్యలలో అంతర్గతంగా ఉంటుందేమో కానీ- ఎందుకంటే అటువంటి దాడులన్నీ అంతకుముందు జరిగిన దాడులకి జవాబుగానే జరుగుతాయి కాబట్టి- గురి తప్పకుండా జరిగే దాడి గురించి ప్రతీకార దాడికి ముందే విశ్వసనీయ ఇంటలిజెన్స్ ఉండాలి అన్న అవసరం ఏమి లేదు. ఈ వ్యత్యాసం ఎత్తిచూపడంలో నా ఉద్దేశం జరిగిన వాయు దాడుల సాధికారతని ప్రశ్నించడం కాదు. నా ఉద్దేశం కేవలం విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పిన విధంగా ఈ దాడులకి అంతర్జాతీయ చట్టాలలో చట్టబద్ధత ఉందా లేదా అని చూడటం మాత్రమే.
ఇక తప్పక జరగబోతున్న దాడుల గురించి అందిన “విశ్వసనీయ ఇంటలిజెన్స్” విషయానికి వస్తే ఇక్కడ కేవలం రెండే అవకాశాలు ఉన్నాయి: భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీకి ఈ సమాచారం అయితే ఫిబ్రవరి 14కి ముందే అంది ఉండాలి లేకపోతే తరువాత అంది ఉండాలి. ఒకవేళ అది పుల్వామా దాడి కన్నా ముందే అంది ఉండి అది నమ్మదగినది అనుకున్నా, దాని ఆధారంగా చర్య తీసుకోగలిగే ఇంటలిజోన్స్ అది కాబోదు. ఎందుకంటే జరిగిన పుల్వామా దాడినే అది సూచించింది. దాడి జరిగిపోయింది కాబట్టి దాడిని అడ్డుకునే అవకాశమే అందులో లేదు. అందువలన పాకిస్థాన్ భూభాగంలో జరిపిన దాడి ముందస్తు దాడి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనలో పస లేదు. ఎందువలన అంటే అత్యవసరం అనే సూత్రాన్ని మంత్రిత్వ శాఖ నిరూపించలేకపోయింది.
“బహుళ సంభావ్య ఆత్మాహుతి దాడులు” గురించి సమాచారం పుల్వామా దాడి తరువాత లభించి ఉంటే వైమానిక దాడి ప్రతీకార చర్య అనే వాదన మహా అయితే అర్థ-సత్యం. ఈ సంభావ్య దాడుల స్వభావం, తీవ్రత గురించి ఎటువంటి సమాచారం లేకపోవటం వల్ల ఒక డజను మిరాజ్ యుద్ధవిమానాలు వాడవలసిన అవసరాన్ని ఉందో లేదో నిర్ణయించటం అసంభవం కాకపోయినా చాలా కష్టం. ఒకవేళ జరగబోతున్న దాడుల గురించి నమ్మదగిన సమాచారం ఉన్నా ముందస్తు ఆత్మరక్షణ దాడి అవసరం, సమతౌల్యపు బలప్రయోగానికి కొలమానం ఆ జరగబోయే దాడి స్వభామే కానీ పుల్వామా దాడి కాదు. పుల్వామా దాడి తరువాత మరిన్ని దాడులు జరగబోతున్నాయి అనే విషయం కేవలం ఒక కట్టు కథా లేకపోతే నిజమేనా అనే విషయం ప్రభుత్వం దగ్గరున్న వాస్తవాల నుండే తెలుస్తుంది. నా అనుమానం ఏంటంటే ప్రభుత్వానికి ఆ వాస్తవాలని ప్రజల ముందు పెట్టడం ఇష్టం లేదు అని.
ఉగ్రవాద వ్యతిరేక దాడుల సాధికారత నిస్సందేహమైనదే అయినా అంతర్జాతీయ చట్టలకి లోబడి చేశాము అని చెబుతున్న విషయం ఆమోదయోగ్యంగా లేదు. వాస్తవానికి ఒక కొత్త సాంప్రదాయ అంతర్జాతీయ చట్టబద్ధ నియమాన్ని అభివృద్ధి చెయ్యటానికి ఒక సార్వభౌమ దేశంగా, దేశాల సమూహంలో ఒక సమాన సభ్యురాలిగా భారతదేశానికి హక్కు ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవలసినది ఏంటంటే ఒక చట్టబద్ధ సాధికారత ఉంది అన్న కల్పిత భావనతో అలా చెయ్యటం వల్ల అమెరికా “ముందస్తు ఆత్మరక్షణ” సిద్ధాంతాన్ని బలోపేతం చేసిన వారిమవుతాము. అంతేకాక సాంప్రదాయ అంతర్జాతీయ ప్రమాణాన్ని దిగజార్చినవారం కూడా కూడా అవుతాము.
ఒకవేళ అంతర్జాతీయ చట్టానికి అమెరికా వారు ఇచ్చిన నిర్వచనాన్నే మనం గుడ్డిగా అనుసరించదలుచుకుంటే దానికన్నా సుళువైన, తక్కువ కష్టతరమైన, ఎక్కువ ప్రభావశీలత కలిగిన సమర్ధన విదేశాంగ మంత్రిత్వ శాఖ వాడి ఉండవచ్చు. అది ఐక్యరాజ సమితి చార్టర్ లోని 51 వ అధికరణ. దాని ప్రకారం రాజ్యేతర శక్తుల సాయుధ దాడుల నుండి కాపాడుకోవటానికి “అంతర్గత ఆత్మ రక్షణ హక్కు ” భారతదేశానికి ఉంది. అమెరికా ముందస్తు ఆత్మరక్షణ దాడి సిద్ధాంతాన్ని అన్వయించిన మంత్రిత్వ శాఖ అమెరికా చట్టబద్ధ విధానానికి, అంతర్జాతీయ చట్టబద్ధ నియమాలకి మధ్య ఉన్న ఒక కీలకమైన వ్యత్యాసాన్ని గుర్తించలేదు. అది ఏమిటంటే అమెరికా సిద్ధాంతం ఉగ్రవాదులకూ, వారికి ఉద్దేశపూర్వకంగా మద్దతు కానీ సహాయం కానీ అందించేవారికి మధ్య తేడాని గుర్తించదు. మరొకవైపు 9/11 తరువాత జైష్ లాంటి రాజ్యేతర శక్తుల దాడులకి వ్యతిరేకంగా ఉన్న ఆత్మరక్షణ హక్కు అంతర్జాతీయ చట్టబద్ధ పాలనలో మరింత బలపడింది. అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్న తీవ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధం (War on Terror) కు ఇదే పునాది. అంతే కాక 2015 పారిస్ దాడుల తరువాత సిరియాలోని ఐ.ఎస్.ఐ.ఎస్. మీద దాడులకి ఫ్రాన్స్ 51వ అధికరణని వాడుకుంది.
ఈ న్యాయ సూత్రం మూడు ప్రయోజనాలని నెరవేర్చి ఉండేది. మొదటిది ఏమిటంటే పుల్వామా దాడి, IC 814 విమానం హైజాక్ తదితర ఉగ్రవాద చర్యలకి కారణమైన వారిని శిక్షించాము అని బహిరంగంగా చెబుతున్న భారత ప్రభుత్వ ప్రకటనకి ఈ న్యాయ సూత్రం ఒక సాధికారత కలిపించి ఉండేది.
రెండవది తమ ఉద్దేశం కేవలం జైష్ స్థావరాలని ధ్వంసం చెయ్యటమే కానీ వాటికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్ మీద దాడి కాదని భారత దేశం సూచించిఉంటే, భారతదేశం తమ మీద దాడి చేసింది కాబట్టి తమకి ఆత్మ రక్షణ హక్కు వాడుకునే హక్కు ఉందని పాకిస్థాన్ చేసే వాదనలకి అంతర్జాతీయ చట్టంలో పెద్ద మద్దతు లభించేది కాదు. ఫిబ్రవరి 27 నాడు సరిహద్దు సమీపాన పెరిగిన ఉద్రిక్తతలు ఊహించనవి ఏమి కాదు. ఎందుకంటే అప్పటికే పాకిస్థాన్ పుల్వామా దాడి తరువాత భారతదేశం చర్యలు ప్రాంతీయ భద్రతకు భంగకరంగా ఉన్నాయని ఐక్యరాజసమితి భద్రతా విభాగానికి రాసిన లేఖలో పేర్కొంది.
మూడవది, వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ సేనలతో కాకుండా జైషె మొహమ్మద్తో జరిగే పోరాటానికి రాజ్యేతర శక్తితో జరిగిన సాయుధ పోరు అనే చట్టబద్ధత వచ్చి ఉండేది. అప్పుడు ఇండియా 1949 నాటి జెనీవా ఒప్పందంలోని కామన్ ఆర్టికల్ 3కు మాత్రమే కట్టుబడి ఉండాల్సి వచ్చేది. దాని ప్రకారం పుల్వామా దాడి కారకులను శిక్షించేందుకు చేపట్టాల్సిన టెరరిస్టు వ్యతిరేక చర్యల విషయంలో భారత సేనలకు మరింత వెసులుబాటు ఉండేది. నిజానికి భారత్ వాయుసేన దాడికి ప్రతీకారంగా పాక్ చేసిన దాడులతో ఇప్పుడు మనం రెండు సార్వభౌమిక దేశాల మధ్య జరిగే సంప్రదాయ అంతర్జాతీయ సాయుధ పోరులో చిక్కుకున్నాం. దీని వల్ల రెండు దేశాలూ మొత్తం నాలుగు జెనీవా ఒప్పందాల పరిధిలోకీ, జస్ ఇన్ బెల్లో (అంతర్జాతీయ మానవీయ చట్టం నిబంధనల ప్రకారం యుద్ధంలో పాల్గొనే వారు వీలైనంత తక్కువ బాధకు గురయ్యే జాగ్రత్తలు తీసుకునే కట్టుబాట్లకు యుద్ధం చేసే దేశాలు లొంగడం) పరిధిలోకీ వెళ్లాయి.
-గుంజన్ చావ్లా
ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ గవర్నెన్స్లో రచయిత టెక్నాలజీ, నేషనల్ సెక్యూరిటీ ప్రోగ్రాం మేనేజర్. ఆమె ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో 2017-18 మధ్య జ్యుడీషియల్ ఫెలోగా కూడా పని చేశారు.
‘స్క్రోల్.ఇన్’ వెబ్సైట్ సౌజన్యంతో