ఫేస్ బుక్ బీజేపీ లొల్లిలో కాంగ్రెస్
యంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు మొత్తం సీన్ అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను డామేజ్ చేయాలన్న ఆలోచన బీజేపీ చేస్తోందా? రాహుల్ గాంధీ… బీజేపీ ఫేస్ బుక్ కుమ్మక్కు గురించి మీడియాలో దూకుడు పెంచితే… కథ రివర్స్ గేర్ లో కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంటోంది. బీజేపీ నేతలు రెచ్చిపోయి… ఫేస్ బుక్ లో విధ్వంసకర స్టేట్మెంటిస్తుంటే… ఆ కంపెనీ ఏం చేస్తోందంటూ… కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తుంటే… అదే సమయంలో హస్తం పార్టీ నాయకత్వం గురించి సంజయ్ ఝా ప్రశ్నించడం… అందులో కూడా సోనియా గాంధీకి… కాంగ్రెస్ పార్టీ నేతలు లేఖ రాశారంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రెకెత్తిస్తోంది.
సోనియా గాంధీకి వంద మంది లేఖా?
నాయకత్వ మార్పు కోరుతూ సోనియా గాంధీకి వంద మంది లేఖ రాశారంటూ బహిష్కృత కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝా లేఖ కాకరేపుతోంది. ఐతే సంజయ్ ఝా చెబుతున్నట్టు లేఖ ఏమీ లేదంటూ కాంగ్రెస్ పార్టీ చప్పుడు చేస్తోంది. కొందరు కావాలని పనిగట్టుకొని ఇలాంటి లేఖలు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రన్ దీప్ సింగ్ సుర్జేవాలా స్పష్టం చేశారు. లేని లేఖలు ఉన్నాయంటూ… ప్రచారం చేస్తున్నారంటూ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఫేస్బుక్కి సంబంధించి రాసిన లేఖను పక్కదోవ పట్టించే కుట్ర చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. సచిన్ పైలట్ వ్యవహారంలో పార్టీని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు గాను సంజయ్ ఝాను అధికార ప్రతినిధిగా తొలిగించడమే కాకుండా, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
cwc meeting file photo
లేఖ పేరుతో కాంగ్రెస్పై కుట్రలు
ఇవాళ ఉదయం బహిష్కృత నేత సంజయ్ ఝా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. సుమారుగా వంద మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు… వారిలో ఎంపీలు సైతం… మొత్తం గందరగోళ పరిస్థితులపై సోనియా గాంధీకి లేఖ రాశారని… CWC ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారని… నాయకత్వ మార్పుపై తగిన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారని ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. అయితే ఝా చేసిన ట్వీట్ పూర్తిగా నిరాధారమైనదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులుగానీ, ఎంపీలుగానీ అలాంటి లేఖ ఏదీ రాయలేదని… ఝా చేస్తున్న ప్రచారం కేవలం కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే కుట్రలో భాగమంటూ పార్టీ అధికార ప్రతినిధి, రాహుల్ గాంధీ ముఖ్య అనుచరుడు రణదీప్ సింగ్ సుర్జేవాల పేర్కొన్నారు.
ఫేస్బుక్-బీజేపీ కుమ్మక్కు బయకు రాకుండా…
ఫేస్బుక్తో బీజేపీ కుమ్మక్కు గురించి జరుగుతున్న అంశంలోని వాస్తవాలు బయటకు రాకుండా చేసేందుకు మీడియాలో తప్పుడు సమాచారం ఇచ్చే ఒక ఒక సెక్షన్… టీవీ డిబేట్ గైడెన్స్లో కాంగ్రెస్ పార్టీపై కుట్ర చేస్తోందంటూ సుర్జేవాల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసే నీతిబాహ్య చర్యలను వెలుగులోకి తెచ్చే సమయంలో కావాలని తెరపైకి ఈ అంశాన్ని తెచ్చారన్నారు. బీజేపీ-ఫేస్ బుక్ లింక్స్ బయటకు రాకూడదనే ఈ కుట్ర పన్నారని… బీజేపీకి మేలు చేసేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఫేస్బుక్ సాక్షిగా బీజేపీ నేతలు నిత్యం చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు, సమాజాన్ని చీల్చేలా చేస్తున్న విపరీత వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఉండటానికి కారణం… బీజేపీ, ఫేస్బుక్ మధ్య లోపాయికారీ ఒప్పందమేనంటూ సుర్జేవాల విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు, రెచ్చగొట్టే అంశాలను ఫేస్బుక్ పట్టించుకోవడం లేదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం సంచలనం రేపుతోంది.
నాయకత్వ మార్పుపై క్లారిటీ కోరుతున్న నేతలు
సంజయ్ ట్వీట్లో చెబుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరగడం లేదని… కానీ సీనియర్ నేతలు కొందరు మాజీ మంత్రులు, ఎంపీలు పార్టీలోని అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకు సోనియాగాంధీ అపాయిట్మెంట్ కోరారని మాత్రం రణదీప్ సింగ్ సుర్జేవాలా తెలిపారు. నాయకత్వానికి సంబంధించి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ క్లారిటీ ఇవ్వాలని… ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారో చెప్పాలన్న వర్షన్ కొందరు నేతలు కోరుతున్నారు. రాజస్థాన్ లో తలెత్తిన సమస్యలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఏ విధంగా పరిష్కరించారో వివరించడంతోపాటు, నాయకత్వానికి సంబంధించిన అంశాన్ని కూడా పరిష్కరించాలని వారు కోరారు.
రాజస్థాన్ మరో మధ్యప్రదేశ్ కాబోతుందా?
అదే సమయంలో రాజస్థాన్ ప్రతిష్టంభన విషయంలోనూ పార్టీ నేతలు క్లారిటీ కోరుతున్నట్టు తెలుస్తోంది. సచిన్ పైలట్ ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల్లో సానుకూలత వ్యక్తం చేసినా… అది తాత్కాలికమేనని.. భవిష్యత్ లో అది మరింత ప్రమాదంగా పరిణమించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయంలో పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. పైలట్ వ్యవహారం పార్టీలో ఎన్నో కొత్త ప్రశ్నలు రేకెత్తించిందని… కొన్నాళ్ల క్రితం మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కోల్పోడానికి కారణమైన జ్యోతిరాధిత్య సింధియా వ్యవహారంతో చూడాల్సిన అవసరం కూడా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజస్థాన్ మరో మధ్యప్రదేశ్ కాకుండా ఉండాలంటే అందుకు పటిష్టమైన చర్చలు అవసరమని పార్టీ నేతలు భావిస్తున్నారు.
అప్పటి వరకు సోనియానే పార్టీ చీఫ్
135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అంతర్గత ఎన్నికల వ్యవహారం చిన్న అంశమైనప్పటికీ… పార్టీలో అంతర్గత ఎన్నికలు జరపాలని చాలా మంది సీనియర్ నేతలు కోరుతున్నారు. సోనియా గాంధీ ఏడాది తాత్కాలిక అధ్యక్షురాలి పదవి ఆగస్టు 10తో పూర్తయినందున… పార్టీలో ఎన్నికల అంశాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే పార్టీలో పూర్తి స్థాయి నిర్ణయం వచ్చే వరకు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తొందరగా పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడ్ని తీసుకురావాలని ఇటీవల ఎంపీ శశిధరూర్ కూడా హైకమాండ్ కు సూచించారు.