(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
మద్యం (ఆల్కహాల్) తాగితే గొంతులో కరోనా వైరస్ చచ్చిపోతుందట..! ఈ మాటలు అన్నది ఏ శాస్త్రవేత్తో కాదు, డబ్ల్యూ హెచ్ ఓ ప్రతినిధి అంతకంటే కాదు. ఫక్తు రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజస్థాన్ ఎమ్మెల్యే.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైరస్ నిర్ములనకు మద్యం, సిగరెట్ మేలు చేస్తాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఎటువంటి పుకార్లు నమ్మవద్దని వైద్యులు సూచిస్తున్నారు. డబ్ల్యూ హెచ్ ఒ కూడా ప్రజలు ఆల్కహాల్ కు దూరంగా ఉండటం మంచిదని తెలియచేసింది.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వైన్ షాప్ లు మూత పడటంతో పలు ప్రదేశాలలో ముందుకు బానిసలు అయిన మందు బాబులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ మెంటల్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఈ తరుణంలో రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందనపుర్ వింత వాదన తెరపైకి తెచ్చి వైన్ షాప్ లు తెరిపించాలని ఏకంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు లేఖ రాయడం విమర్శలకు దారితీసింది.
అయితే ఆయన చెప్పిన వింత వాదన పామరులు నమ్మేవిధంగా ఉండటం విశేషం. ఇంతకూ అయన చెప్పింది ఏమిటంటే ఆల్కహాల్ తో తయారు చేసిన శానిటైజర్ రాసుకుంటే చేతులపై ఉండే వైరస్ నిర్ములన అయినట్లే ఆల్కహాల్ తో తయారైన మద్యం తీసుకుంటే గొంతులో ఉన్న వైరస్ చచ్చిపోతుందని సెలవు ఇస్తూ వైన్ షాప్ లు తెరవాలంటూ సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యే రాసిన లేఖపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.