రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఎలా ఉంది? అన్ని రంగాలను దెబ్బతీసిన కరోనా రియల్ ఎస్టేట్ ని ఎంత మేరకు దెబ్బతీసింది అని చెప్పుకోవాలంటే పెద్ద గాయమే చేసింది. ఇతర రంగాల అన్నింటితో పాటు రియల్ ఎస్టేట్ ను కూడా కరోనా విలయతాండవం వెనక్కి నెట్టేసింది.
అయితే ఏపీలో తాజాగా ట్రైనింగ్ లో ఉన్న మూడు రాజధానులు అంశం కారణంగా రియల్ ఎస్టేట్ రంగంపై ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగం అంటే అత్యధికంగా హైదరాబాదు ఉండేది. గడిచిన ఐదేళ్లలో హైదరాబాద్ స్థానాన్ని అమరావతి ఆక్రమించింది. ఇప్పుడు హైదరాబాదు అమరావతి ఈ రెండు లేకుండా ఈ స్థానాలను మరో కొత్త నగరం కొల్లగొట్టింది. అది ఏమిటో తెలుసుకోవాలంటే మరింత లోతుకు వెళ్లాల్సిందే.
హైదరాబాద్ దెబ్బతిన్నది ఎలా అంటే?
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం 2014, 15వరకు పిక్స్ లో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పటాన్ చెరువు, మెదక్, అవుటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల, శంషాబాద్, ఇటువైపు ఎల్బీనగర్, రామోజీ ఫిలిం సిటీ ఈ ప్రాంతాలన్నీ హైదరాబాద్ శివారు ప్రాంతాలన్ని రియల్ బూమ్ తో కిటకిట లాడిపోయేవి. రిజిస్ట్రేషన్ ల కోసం ముందస్తు దరఖాస్తులు చేసుకుని వెయిటింగ్ లిస్టులో ఉండేవాళ్ళు. అటువంటిది 2014,15 నుంచి క్రమేనా తగ్గుతూ వచ్చింది.
2014 నుంచి 19 మధ్యలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని నాలుగు అంశాలు శాసించాయి. పెట్టుబడిదారులకు అమరావతి ఆకర్షించడం, అమరావతి భవిష్యత్తు భావి రాజధానిగా కనిపించి ఇక్కడ పెట్టుబడులు పెడితే భూముల ధరలు పెరుగుతాయని ఒ వర్గానికి చెందిన వారు అమరావతి చుట్టుపక్కల భూములు కొనడం, దీన్ని తేరుకొని హైదరాబాద్ తట్టుకుని మళ్ళీ వచ్చే సరికి 2016లో నోట్ల రద్దు కావడం, ఆ తర్వాత జీఎస్టీ అమల్లోకి రావడం ఇలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని దారుణంగా దెబ్బతీసాయి. వీటన్నింటిని కోలుకొని ఇప్పుడిప్పుడే స్థిరపడుతుందన్న దశలో కరోనా మరో కాటు వేసింది.
ఈ కాటుతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక దశాబ్దం వెనక్కు వెళ్ళిపోయింది. భూముల ధరలు కూడా 25 నుంచి 30 శాతం తగ్గాయి. అయితే అక్కడ మంత్రి కేటీఆర్ మాత్రం దీన్ని పెంచే క్రమంలో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడంలో కొత్త తరహా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ సంగతి పక్కన పెడితే..
అమరావతిలో నాడు ఆలా!నేడు ఇలా!!
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అమరావతి చుట్టుపక్కల, కృష్ణా, గుంటూరు జిల్లాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగింది. హైదరాబాద్ ఐటీ రంగంలో సంపాదించిన వారు కావచ్చు, హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కావచ్చు, కొందరు అధికారులు కావచ్చు రాజధాని ప్రాంతంలో నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టారు. భూములు కొనుగోలుకు వివిధ ప్రాంతాల వారు ఎగబడ్డారు. దీనితో భూముల రెట్లు విపరీతంగా పెరిగాయి.
అయితే 2019ల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది. అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి భూముల ధరలు సగానికి సగం పడిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిపోయింది. కొనుగోళ్లు, అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి. దీనితో అపార్టుమెంట్ అమ్మకాలలో 20 నుండి 25శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చే పరిస్థితి. ఒ పక్క సిమెంట్, స్టీల్ ధరలు 50శాతం పెరగడంతో తక్కువ ధరకు వచ్చే అపార్టుమెంట్ ల కొనుగోలుకు మధ్య తరగతి వర్గాలు ముందుకు వస్తున్నాయి.
విశాఖకు కొత్త కళ
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల కళ్ళు విశాఖలో భూములపై పడ్డాయి. రాజధాని విశాఖకు తరలుతుండటం, సినీ పరిశ్రమ కూడా విశాఖకు వస్తుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విశాఖలో రియల్ బూమ్ అందుకున్నట్లే కనిపిస్తోంది. కరోనా కాలానికి ముందే విశాఖ లో రిజిస్ట్రేషన్ ల సంఖ్య సగటు కంటే 15 శాతం ఎక్కువగా జరిగింది అని లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు కరోనా కాలంలోనూ సగటు రిజిస్ట్రేషన్లు జరుగుతునే ఉన్నాయి.
ఇది ముగిసిన వెంటనే రిజిస్ట్రేషన్ ల కోసం కచ్చితంగా భారీగా ఎగబడతాడని అంచనా ఉంది. విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న విజయనగరం జిల్లాలోని భోగాపురం, విశాఖపట్నం శివారు ఉన్న ఆనందపురం, గాజువాక, కొత్తవలస తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఉపందుకొంది. భూముల ధరలు గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 150 నుంచి 200 శాతం వరకు పెరిగాయి.