సోము వీర్రాజు ఏపీ బిజెపి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టక ముందు తమకు, జనసేనకు ఉన్న ఓటు బ్యాంకు కి తోడు ఇతర పార్టీల నుండి కొందరు నేతలని తెచ్చుకొని కనీసం 45 శాతం ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకునే సామర్థ్యం తమకు ఉందని…. వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించడం ఖాయమని అన్నారు. దీనిని ఎవరు సీరియస్ గా తీసుకోకపోయినా…. ఇప్పుడు వీర్రాజు అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత ఆయన వెళ్తున్న దూకుడు చూస్తుంటే అందరూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారు. మరి అతని దూకుడు చివరికి వారి పార్టీకి ఉపకరిస్తుందా లేదా…?
సొంత పార్టీ వారు, బయట పార్టీ వారు.. ఇద్దరు టార్గెటే..!
వీర్రాజు రాజకీయం కొత్తగా ఉంటుంది. ముందు ఇతర పార్టీలలో ఉండి గుర్తింపునకు నోచుకోని నేతలకు సంబంధించిన జాబితాను సోము వీర్రాజు రెడీ చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. వీరిని ఏదో ఒక రకంగా బిజెపి వైపుకు లాగగలిగితే పార్టీ మరింత పటిష్టం అవుతుందని ఆయన ఆశ. ఇక ఇదే సమయంలో వీరిని బీజేపీకి తీసుకుని వచ్చి ముఖ్య పదవులు కట్టబెట్టే క్రమంలో కావాలని కన్నా లక్ష్మీనారాయణ వర్గంగా పేరుపడ్డ వారిని ఏదో ఒక కారణం చూపించి పార్టీ నుండి తప్పిస్తున్నారన్న విషయం కూడా తెలిసిందే. మరి ఈ తరహా రాజకీయం ఇప్పటి వరకు ఎవరైనా చేశారేమో.. చరిత్ర పుస్తకాలను వెనక్కి తిప్పి చూడాల్సిందే.
ఈ పేర్లన్నీ కాషాయం కప్పుకుంటాయా…?
ఇక ఇదే క్రమంలో టిడిపిలో ఉండి బిజెపి పాట పడుతున్న వారి జాబితాను కూడా సోము సిద్ధం చేశారు. అధికార పార్టీ విషయానికి వస్తే సబ్బంహరి, దాడి వీరభద్రరావు ,హర్షకుమార్ పేర్లు తటస్థంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం వైపు మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ పేరు లిస్టులో ఉందని ప్రచారం జరుగుతోంది. అతను వస్తే ఆయన కుమారుడిని కూడా ఆహ్వానించేందుకు సోము రెడీగా ఉన్నారు. అలాగే జేసి కుటుంబం, పరిటాల కుటుంబాలని వారితో సన్నిహితంగా ఉన్న బీజేపీ నేతలతో లాబీ నడుపుతున్నారని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మంచి పదవులు అనుభవించిన నేతలు గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిపై సోము గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇక జగన్ సొంత జిల్లాలో ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి బిజెపిలో ఉన్నారు. ఆయన ప్రోద్బలంతో మరికొంతమంది వస్తే కమలం కళకళలాడుతుంది.
అదే జరిగితే జగన్ నెత్తిన పాలు పోసినట్లే….
అంతర్గతంగా ఏమి జరిగినా…. పైకి మాత్రం జగన్ ఇతర పార్టీల నుండి వచ్చిన వారిని తన పార్టీలోకి అనుమతించలేదు. టీడీపీకి చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలను కూడా గేటు బయట నిల్చోబెట్టి విమర్శలు చేయిస్తున్నాడు. రాపాక వరప్రసాద్ తనంత తాను స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ వైసిపి నుండి అతనికి ఎలాంటి మద్దతు లభించలేదు. ఈ సమయంలో బిజెపి వారు ఇలా ఇతర పార్టీ నేతలను గాలం వేసి పట్టుకుంటే ఆ ఫలితం కాస్తా చివరికి వెళ్ళేది జగన్ నోట్లోకి అన్నది సోముకి అర్థం కావడం లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘మాట తప్పడు…. మడమ తిప్పడు’ అనే ముద్ర ఉన్న జగన్ విషయంలో ఈ సింపతీ తోడైతే…. ఈ రాజకీయాలు చేసిన బిజెపి బ్యాడ్ ఇమేజ్ పొందుతుందని…. కాబట్టి పవన్ లాగా న్యాయబద్ధమైన రాజకీయాలు చేయడమే శ్రేయస్కరం అని సలహాలు ఇచ్చేస్తున్నారు. మరి వీర్రాజు వింటాడా??