ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి తన సొంత ఎమ్మెల్యేలే బలం. ముందు నుండి జగన్ తో కలిసి నడుస్తున్న వారు అతను తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ప్రతి ఒక్కసారీ సమర్థిస్తూనే ఉన్నారు. పరిపాలనా పరంగా కొత్త సంస్కరణలు తెస్తున్న జగన్… పాలనా పరంగా ముందుకు దూసుకు వెళ్తున్నా కూడా అతనికి కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. జగన్ తీసుకుంటున్న సంస్కరణలు సొంత పార్టీ నేతల్లో కొందరికి నచ్చడం లేదు. మరి వారు నేరుగా జగన్ కు తమ వ్యతిరేకతను తెలియజేసే పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఇంతకీ ఆ విషయం ఏమిటి..?
ఆ నిర్ణయమే కొంపముంచింది
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను పట్టించుకోకపోవడం వెనుక లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాల వారీగా చేయనున్న విభజనకు కారణమని ఇప్పుడు వైసిపి వర్గాలు అంటున్నాయి. వచ్చే సంక్రాంతి తర్వాత జిల్లాలను విభజించి… కొత్త జిల్లాలతోనే ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో స్థానిక సంస్థల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. చాలామంది స్థానిక నేతలు కొత్త జిల్లా లోకి వెళ్లడం వల్ల వారి బలం తగ్గిపోతుంది అని భావిస్తున్నారు. దీనితో ఆ ఎఫెక్ట్ నేరుగా జగన్ పై పడింది.
డిమాండ్లు ఇలా ఉన్నాయి…
చాలామంది వైసిపి సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, జగన్ తో సన్నిహితంగా ఉండే లోకల్ లీడర్లు మాత్రం తమ జిల్లాలను విభజించవద్దని కోరుతుంటే మరికొందరు తమ నియోజకవర్గాన్ని మరో జిల్లాలో కలపాలని… మిగిలినవారు తమకే కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ లు తెర మీదకు మీదకు తీసుకుని వస్తున్నారు. వాటిల్లో ప్రప్రథమంగా అరకు నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో ఉంది. ఈ లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లా చేయడం స్థానిక నేతలకు ఏమాత్రం నచ్చడం లేదు. అలాగే సంబంధం లేకుండా తమకు సెపరేటు జిల్లా కావాలని పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు కానున్న తిరుపతి జిల్లా లో కలపవద్దని కొంతమంది కోరుతుంటే… మదనపల్లి ప్రత్యేక జిల్లా కావాలని చిత్తూరు జిల్లా లోని కొంతమంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
ఇంత ధైర్యం ఎక్కడిది….?
మామూలుగా జగన్ మాటకు అతని పార్టీ ఎమ్మెల్యేలు ఎదురు చెప్పే అవకాశం ఇన్ని రోజులూ రాలేదు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల నుండి అతనికి విపరీతమైన సపోర్ట్ లభిస్తోంది. సచివాలయ వ్యవస్థ ద్వారా ఎమ్మెల్యేల పై కూడా బాగా ఒత్తిడి తగ్గిపోయింది కానీ ఇలా జిల్లాల విభజన వల్ల మొదటికే మోసం వస్తుంది అని తెలిసి ఏకంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటివారు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇదే క్రమంలో ధర్మాన.. శ్రీకాకుళం జిల్లాను మూడు ముక్కలు గా చేయడాన్ని వ్యతిరేకిస్తుండగా… అలాగే కృష్ణాజిల్లాకి చెందిన నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను ఏలూరులో కలపవద్దని అక్కడి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ మొదటి సారి ముఖ్యమంత్రి కావడం… చాలామంది కోస్తా నేతలకు అతని కంటే ఎక్కువ రాజకీయానుభవం ఉండడంతో ఎలాగో జగన్ వచ్చే సంవత్సరం వరకు సమయం ఇచ్చారు కాబట్టి చాలా ధైర్యంగా ఆయనకు దిశా నిర్దేశం చేయాలని చూస్తున్నారు.
మరి జగన్ ముందుగానే చెప్పినట్లు దీనిలో ప్రజా ప్రతినిధులు కల్పించుకునేందుకు తేల్చి చెబుతారా లేక సొంత ఎమ్మెల్యేల అవసరాల గురించి ఆలోచిస్తారా అన్నది ఇక్కడ ప్రశ్న.