టీడీపీ అధినేత చంద్రబాబు సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా..? సానుభూతి వస్తుందని ఆశపడుతున్నారా..? తప్పటడుగులు వేస్తున్నారా..? అసలు ఆయన ఏమి ఆలోచిస్తున్నారు..? పార్టీ రాష్ట్ర కమిటీ నియామకానికి ఏ సిద్ధాంతం ఫాలో అవుతున్నారు..? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కొల్లు రవీంద్ర, ప్రధాన కార్యదర్శిగా బీదా రవించ్ర యాదవ్, కొన్ని కీలక పదవుల్లోకి చింతమనేని ప్రభాకర్ వంటి నాయకులను నియమించడం వెనుక చంద్రబాబు అసలు వ్యూహం ఏమిటి? అనేది టీడీపీ వర్గాల్లోనే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది.
జైలు పక్షులకే పదవులా..? ఏమిటి బాబు వ్యూహం..?
గడచిన కొన్ని నెలలుగా జగన్మోహనరెడ్డిని చంద్రబాబు గానీ ఆ పార్టీ నాయకులుగానీ విమర్శించాలి అంటే “మీ అధినేత జైలుకు వెళ్ళివచ్చాడు, జైలుకు వెళ్ళివచ్చాడు అంటూ పదేపదే దెప్పిపొడుస్తుంటారు. అవినీతి కేసులో ముద్దుయిగా మీ అధినేత జైలుకు వెళ్ళివచ్చాడు” అనేది టీడీపీ ఫిక్స్ అయ్యింది. మరి ఇటువంటి సమయంలో చంద్రబాబు ఇప్పుడు ఆ జైలు పక్షుల మీదనే ఆధారపడుతున్నట్లు కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడికి ఎక్కడలేని సానుభూతి వచ్చేసింది. ఈఎస్ఐ కుంభకోణంలో ఈయన పాత్ర ఉంది అని ఏసిబీ అరెస్టు చేసిన తరువాత సుమారు మూడు నెలలు జైలులో ఉండి వచ్చిన తరువాత అచ్చెన్నాయుడు టీడీపి క్యాడర్కు రాష్ట్ర వ్యాప్తంగా హీరో అయిపోయారు. అందుకే ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షపదవి ఇచ్చేయాలనేది బాబు తాజా వ్యూహం. ఆయన లాగే మచిలీపట్నంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చిన కొల్లు రవీంద్రకు కూడా టీడీపీ ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలనేది బాబు గారి మరో వ్యూహం. నిజానికి బీదా రవీంద్రయాదవ్ కు టీడీపి అధ్యక్ష పదవి ఇస్తారని గడచిన నాలుగైదేళ్లుగా టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లేదా యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్ప, అయ్యన్న పాత్రుడు వంటి నాయకుల పేర్లు వినిపించేవి. ఇప్పుడు ఈ పేర్లు అన్నీ పక్కకు వెళ్ళిపోయి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర పేర్లు తెరమీదకు రావడం వెనుక కేవలం జైలుకు వెళ్లి వచ్చారన్న సానుభూతే కనిపిస్తోంది. అందుకే బాబు సెంటిమెంట్ను, సానుభూతినో నమ్ముకుని రాజకీయం మొదలు పెట్టారని అనిపిస్తోంది.
చింతమనేని ప్రభాకర్కు ఇతర నాయకులకు కూడా రాష్ట్ర కమిటీలో కీలక పదవులట..!
సానుభూతి వ్యూహాలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రకే పరిమితం అవ్వలేదు. అట్రాసిటీ కేసు, దూషణల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన పశ్ఛిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కూడా రాష్ట్ర స్థాయిలో కీలకపదవి ఇచ్చేందుకు బాబు సిద్ధం చేశారు. ఆయనతో పాటే మరి కొంత మంది దూకుడుగా ఉన్న నాయకులకు రాష్ట్ర కమిటీలో చోటు ఇస్తున్నారు. ఇవన్నీ గడచిన వారం రోజులుగా చంద్రబాబు ముఖ్యనేతలతో కలిసి మంతనాలు జరిపి దాదాపుగా 25మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని సిద్ధం చేశారు. జాతీయ కార్యవర్గంలో ఎలాగూ లేకేష్, యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు వంటి నాయకులు ఉంటారు. సో..దిగువ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దూకుడుగా ఉండే నాయకులు సానుభూతి పొందగలిగే నాయకులు ఉండాలనేది బాబు గారి వ్యూహం కావచ్చు. బాబు గారి వ్యూహం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది..? జగన్ ను ఏ మేరకు ఇరుకున పెట్టగలరు..? అనేది చూద్ధాం..!!