మాటలు చెప్పని మోడీ…, మాటలు మార్చని చంద్రబాబు.., అనర్గళంగా మాట్లాడే లోకేశు.., మాటల్లో బాబుని తిట్టని జగను… వీటిని ఊహించుకోలేం…! కొన్ని అలా ఫిక్సయిపోతాయి. అనుహ్యంగా మేము మారిపోయాము బాబు అంటే సగటు రాజకీయ అభిమానులు షాక్ తినే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ అంటే…!! చంద్రబాబు గారి తాజా చతురత, తాజా మాటని ఒకసారి ప్రస్తావిస్తూ మొదలు పెడదాం…!!
చంద్రబాబు గుణం.., రాజకీయం.., చతురత గురించి పెద్దగా చర్చించాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది…! కానీ
ఇక్కడ మోదీగారి మతి మెరుపు గురించే మాట్లాడుకోవాలి. మోడీకి మతిమరుపు ఉందో లేదో రేపో, మాపో తెలిసిపోతుంది. అసలు చంద్రబాబు చతురతకి, మోడీ మతిమరుపుకి లింకు ఏంటి..? ఎక్కడా అర్ధం కావడం లేదా..? ఇంకొంచెం లోతుగా వెళదాం..!
“నీకు కుటుంబం, బంధాలు లేవు. మీరు మా హక్కులు కాలరాశారు. మా రాష్ట్ర అభివృద్ధిని ఒర్వేకపోతున్నారు. మీ కంటే నేను ముందే ముఖ్యమంత్రిని అయ్యాను. గుజరాత్ ని ఏం అభివృద్ధి చేసావు..? మీ రాష్ట్రం కంటే దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి..? మీకు మేము బానిసలం కాదు. మీరు పబ్లిసిటీ పీఎం. మీరు పనిచేసే పీఎం కాదు. మాకు పనిచేసే పీఎం కావాలి” – ఇవన్నీ సందర్భానుసారంగా 2018 మర్చి నుండి 2019 ఏప్రిల్ మధ్య చంద్రబాబు మాట్లాడిన మాటలు.
“మీ సమర్ధ, శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత గణనీయంగా ఇనుమడించింది, మన సాయుధ దళాలు నూతన విశ్వాసాన్ని పొందాయి. అంతర్గతంగా, ఉగ్రవాదులు మరియు ఉగ్రవాద శక్తుల నుండి వచ్చే ముప్పు తగ్గింది, దేశం వెలుపల సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి” – ఇవి తాజా లేఖలో చంద్రబాబు మోడీకి చేసిన భజన. రాజకీయాల్లో భజనలు సాధారణమే. బిస్కట్లు వేయడం సాధారణమే. అందులో తెలుగునాట మరింత ఘాటుగా, వాడి, వేడిగా ఉంటాయి. ఏ పార్టీ, ఏ నాయకుడు అతీతుడు కాదు. కానీ దీనిలో ఆరితేరింది, రాజగురువు మాత్రం చంద్రబాబే. ఆయన పరిస్థితుల్లో, ఆయన రాజకీయమో కానీ ఈజీగా, సులువుగా దొరికిపోతారు.
మోడీకి సర్వం తెలిసే ఉంటుంది… కానీ…!!
ప్రధాని మోడీ సర్వ జ్ఞాని. ఒకరకంగా చంద్రబాబుకి మించిన మాటకారి, బాబుకి మించిన చతురత, లౌక్యం ఉన్న నేత. ఏది బిస్కట్లు, ఏది భజన అని తెలుసుకోని స్థాయిలో లేరు. అందుకే బాబోరు వేసిన బిస్కట్లు మోడీ తినే అవకాశం లేదు. కానీ…!! చంద్రబాబు లేవనెత్తిన అంశం సీరియస్. ఒక సంచలనాత్మకం, వ్యవస్థల్ని శాసించే అంశం. అందుకే ఆ అంశంపై ప్రధాని హోదాలో స్పందించకపోయినా…, తన చేతిలో ఉన్న కొన్ని వ్యవస్థల ద్వారా ప్రాధమిక విచారణ మాత్రం చేయించాలి. లేఖలో అంశాలు వాస్తవమో, కాదో నిర్ధారించుకున్న తర్వాతనే పూర్తిస్థాయి విచారణకు దించాలి. బాబు బిస్కట్లు తినకుండా… తన స్వీయ అధికారాలు, తమ పట్టుతో వీటిపై స్పందించే అవకాశం మాత్రం ఉంది. అయితే ఇక్కడ రాజకీయ అవసరాలు, రహస్య ఒప్పందాలు, కొన్ని చీకటి కోణాలు కూడా ప్రభవితం చూపిస్తాయి. వీటన్నిటి ఆధారంగానే పీఎం టీం స్పందన ఉంటుంది.