కోబ్రా పోస్ట్ అనే సంస్థ నిర్వహించిన ఓ స్కామ్లో దాదాపు 36 మంది బాలీవుడ్ సెలబ్రిటీలు అడ్డంగా బుక్కయ్యారు. ఈ విషయం జరిగిన వారం అయ్యిందో లేదో మరో విషయంలో మరికొంత స్టార్ సినీ సెలబ్రిటీలు బుక్కయ్యారు. ఈసారి బాలీవుడ్తో పాటు టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ స్కామ్లో ఉండటం కొసమెరపు. సమాచారం ప్రకారం అసలు వివరాల్లోకెళ్తే… మల్లీ మార్కెటింగ్ సిస్టమ్ అనేది చైన్ మార్కెటింగ్ వ్యవస్థ. కొన్ని నెలలు క్రితం ఈ వ్యవస్థలోని లోపాల కారణంగా ప్రభుత్వాలు ఈ వ్యవస్థలపై చర్యలకు దిగాయి. ఎవరైనా ఇలాంటి మల్లీలెవల్ మార్కెటింగ్ చేస్తుంటే వారిపై కేసులు నమోదు చేస్తున్నాయి.
ఆ కోవలో క్యూ నెట్ అనే మల్టీ లెవల్ మార్కెటింగ్ విషయంలో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి కూపీ లాగారు. తీగ లాగితే డొంకంత కదిలినట్లు ఈ సిస్టమ్లో ఉన్న పెద్ద తలల పేర్లు బయటకు వచ్చాయి. బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్, బాలీవుడ్తో పాటు టాలీవుడ్ సినిమాలు చేస్తున్న బోమన్ ఇరాని, టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే, ఇక తెలుగు సినిమాల్లో హీరోగా హిట్ కొట్టాలనుకుంటున్న స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ పేర్లు బయటకు వచ్చాయి. మరి వీరి ప్రమేయం ఎంత వరకు ఉందో తెలియదు కానీ.. పోలీసులు మాత్రం వీరిపై కేసు నమోదు చేసి నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో ఉన్న సినీ సెలబ్రిటీలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.