భారతదేశంలో ప్రతీ ఒక్కటి శాస్త్రీయత కలిగినవే. కానీ వాటిని అర్థం చేసుకోవడంలో ఆధునికత పేరుతో చాలా విషయాలలో మనం విఫలం అయ్యాం. జీవితంలో అతి ప్రధానమైనవాటిలో భోజనం ఒకటి. భోజనం చేయడానికి మన పెద్దలు పెట్టిన నియమాలు తెలుసుకుందాం…
- భోజనానికి ముందు,తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.
తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)
తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. చాలా దోషం. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.
ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు. ఉపనయనం అయినవారు తప్పక ఔపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. (ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.) భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.
వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం,
భోజనం చేయడం చాలా ఉత్తమం. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం. భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.
అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. నోరు నీటితో పుక్కిలించుకోవాలి. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.) స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము.
పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.
అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది. ఇలా అనేక రకాలైన నియమాలను మన పూర్వీకులు పాటించి ఆరోగ్యంగా ఉన్నారు. కానీ మనం వాటిని విస్మరించి అనేక తెలియన రోగాలకు నియలంగా మారుతుండటం విచారకరం. ఇప్పటికైనా కష్టమైనా స్వధర్మం ఆచరించి ఆరోగ్యంగా ఉందాం.