Eenadu Cartoonist Sridhar: తెలుగు మీడియాలో చెరిగిపోని ఒక బ్రాండ్ ఈనాడు.. మీడియాని ఒక రేంజికి తీసుకెళ్లి.. మీడియా ముసుగులో రాజకీయాలను, పెద్ద పెద్ద కుర్చీలను శాసించిన పత్రిక ఈనాడు.. ఆ అధినేత రామోజీకి దేశ వ్యాప్త ఖ్యాతి తీసుకొచ్చింది..! ఈనాడుకు ఇంతటి ఖ్యాతి రామోజీ ఒక్కరి శ్రమ, కృషి, పనితనం కాదు.. ఈనాడులో ఏ నిర్ణయమైనా ఆలోచన రామోజీది.. ఆచరణ మాత్రం రకరకాల సిబ్బందిది. అటువంటి సిబ్బందిలో కార్టూనిస్ట్ శ్రీధర్ ముఖ్యుడు. ఈనాడు వయసు మొత్తం 47 ఏళ్ళు అయితే అందులో 40 ఏళ్ళు శ్రీధర్ పని చేసారు. శ్రీధర్ కార్టూన్ అంటే అంత ఖ్యాతి. పేపర్ మొత్తం చదవడానికి ముందే కిందనున్న “ఇదీ సంగతి కార్టూన్” చూసి మనసారా నవ్వుకుని,మెదడారా ఆలోచించిన పాఠకులు లక్షల్లో ఉంటారు… ఆరోజుల్లో అదే కార్టూన్ ని తలచుకుని, తలచుకుని నవ్వుకున్నా సందర్భాలు ఉంటాయి.. రాజకీయాన్ని వ్యంగ్యం, చతురత, చురక, కోపం అన్ని రకాలుగా తన కార్టూన్ లో చూపించారు శ్రీధర్. ఆయనకు, ఆయన కార్టూన్లకు ఈనాడు పాఠకుల్లో చాలా మంది బానిసలు. అటువంటి శ్రీధర్ తన ఈనాడుని వదిలేసారు. రెండురోజుల కిందట రిజైన్ చేసారు. దీనికి కారణాలు ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఎవరికి తోచినట్టు వారు సృష్టిస్తున్నారు. “ఈనాడు”, రామోజీ వ్యతిరేకులకు ఇది మసాలా టాపిక్ లా మారిపాయింది.. కానీ ఈనాడు కీలక ఉద్యోగుల అంతర్గత చర్చ.., కొన్ని వాస్తవాలను పరిశీలిస్తే..
Eenadu Cartoonist Sridhar: శ్రీధర్ ఒక ప్రచారానికి కారణమయ్యారు..!
ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ తప్పనిసరి. ఈనాడులో కూడా అలాగే 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉంటుంది. కానీ శ్రీధర్ కి రామోజీ ఒక ఆఫర్ ఇచ్చారు. “ఈనాడులో ఏ ఉద్యోగికి అయినా 60 ఏళ్ళు మాత్రమే.. మీరు మాత్రం ఓపిక ఉన్నంత వరకు, గీయగలిగినంత వరకు గీయండి” అని ఎప్పుడో అభయమిచ్చారు. ప్రస్తుతం శ్రీధర్ వయసు 65 ఏళ్ళు. ఈనాడులో 40 ఏళ్లపాటు పని చేసారు. ఈ సంస్థలో ఇన్నాళ్లు పని చేసిన వారు ఎవ్వరూ లేరు. బహుశా ఈనాడు ప్రస్తుత ఎండీ కిరణ్, ఎడిటర్లు నాగేశ్వరరావు, డీఎన్ ప్రసాద్ లు కూడా మూడున్నర దశాబ్దాలు చేసి ఉంటారెమో.. ఈ సంస్థలో అంతగా పని చేసి, అలసిపోయిన శ్రీధర్ కి విశ్రాంతి కావాల్సి వచ్చింది. కొన్నేళ్లుగా ఆయన మునుపటి వేగంతో, చతురతతో గీయలేకపోతున్నారు. ఆరోగ్యం సహకరించడం లేదు. నడుము నొప్పి, సరిగా నిలబడలేని పరిస్థితి. పైగా గడిచిన ఏడాది వ్యవధిలో రెండుసార్లు కరోనా బారిన పడి , ఆసుపత్రి వరకు వెళ్లి వచ్చారు. తను ఇక రిటైర్ కావాలి అనుకున్నారు. 40 ఏళ్ళ ప్రస్థానం ముగిసిన తర్వాత రిటైర్ అయితే బాగుంటుందని భావించారు. అందుకే ఇటీవల 40 ఏళ్ళు ముగిసాయి. ఆగష్టు 23న తను తప్పుకుంటానని లెటర్ ఇచ్చారు. సంస్థలో సుదీర్ఘ చర్చల తర్వాత ఆగష్టు 30న ఆమోదించారు. అంటే ఇక్కడ శ్రీధర్ రిటైర్ అయినట్టు లెక్క, రాజీనామా కాదు.. కాకపోతే ఆయనే “నేను ఈనాడుకు రాజీనామా చేసాను” అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టడమే వివాదాలకు కారణంగా మారింది, కొంతమందికి మేతగా మారింది..
రామోజీతో ఈయన ఒక్కరు మాత్రమే…!
శ్రీధర్ ఈనాడులోకి ఎలా వచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. 1979 నుండీ విపుల, సితారలో కార్టూన్లు వేస్తున్నప్పటికీ శ్రీధర్ కి గుర్తింపు లేదు. అనూహ్యంగా ఓ రోజు ఒక కార్టూన్ రామోజీ దృష్టిలో పడింది. 1981లో… ఏ బొమ్మనైనా సులువుగా.., సింపుల్ గా కార్టూన్ గా గీసెయ్యడం ఆ కుర్రాడి ప్రత్యేకత.. ఈనాడుకు ఉపయోగపడతాడని గ్రహించిన రామోజీ.. శ్రీధర్ ని తన ఆఫీస్ కి పిలిపించుకుని.. రెండు రోజుల పాటూ కొన్ని టాపిక్ లు ఇచ్చి బొమ్మలు/ కార్టూన్లు గీయమన్నారు. తనకు తోచిన కొన్ని సలహాలు, తన మైండ్ లో ఆలోచనలు చెప్పి గీయించారూ.. అవి ఆయనకు విపరీతంగా నచ్చేసాయి. ఇక మారు ఆలోచన లేకుండా.., వెంటనే శ్రీధర్ ని సంస్థలో ఉద్యోగిగా తీసుకున్నారు. కాలక్రమేణా శ్రీధర్ గెలుపులో ఈనాడు భాగమైంది. ఈనాడు ఎదుగుదలలో శ్రీధర్ భాగమయ్యారు. మధ్య మధ్యలో శ్రీధర్ కి ఎన్నో అవకాశాలు, ఎన్నో రెట్లు అధిక వేతన ఆఫర్లతో అవకాశాలు వచ్చినప్పటికీ ఆయన వెళ్ళలేదు. ఈనాడుని వీడలేదు. ఆ నాడు వందల్లో వేతనానికి చేరిన శ్రీధర్ నేడు లక్షల్లో వేతనంతో రాజీనామా అలియాస్ రిటైర్ అయ్యారు..
“ఈనాడులో వేలాదిగా ఉద్యోగులు ఉన్నారు. కొందరు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. లక్షల్లో వేతనం ఉండవచ్చు. ఈనాడు పేరిట తమకు పేరు సంపాదించవచ్చు. ఈనాడు పేరుతో అనధికారికంగా కొంత వెనకేసుకోవచ్చు. అలాంటి వారు ఈనాడులో కోకొల్లలు. కానీ ఈ సంస్థలో శ్రీధర్ బాణీ ప్రత్యేకం. సిబ్బంది మొత్తం ఎండీ కిరణ్ చేతిలో ఉండవచ్చు. లేదా ఎడిటర్లు చేతిలో ఉండవచ్చు. ఎండీ కిరణ్ తన పైత్యంతో సిబ్బంది విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే తీసుకోవచ్చు. భజనలకు, లాబీయింగులకు అలవాటుపడి చీకటి వ్యవహారాలూ నడిపిస్తే నడిపించవచ్చు. చేరికలు, తొలగింపులు చూసుకోవచ్చు. కానీ శ్రీధర్ మాత్రం రామోజీకి దోస్త్. శ్రీధర్ ప్రతీ నిర్ణయం రామోజీతో పంచుకుంటారు, ఈనాడు ప్రతీ నిర్ణయం శ్రీధర్ తో పంచుకుంటుంది.. అందుకే రాజీనామాకు కొన్ని రోజుల ముందు కూడా శ్రీధర్ రామోజీ దగ్గరకు వెళ్లి “సర్.., ఇక విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను” అని అన్నారట.. “కొన్నాళ్ళు చేయొచ్చుగా.., 40 ఏళ్ళు పని చేసిన మీరు అలసిపోయి ఉంటారు.. కొన్నాళ్ళు చేయగలిగితే చేయండి.. లేదు ఇక చేయలేను అనుకుంటే మీకు టైమ్, ఓపిక ఉన్నప్పుడు కార్టూన్లు వేసి పంపించండి” అని స్వేచ్ఛగా చెప్పారట.. ఇదీ ఈనాడుకు, శ్రీధర్ కి ఉన్న బంధం. అయితే ఈ 40 ఏళ్లలో ఈనాడు వైఫల్యమో, దిరద్రుష్టమో శ్రీధర్ కి ప్రత్యామ్నాయం లేదు. కొన్నేళ్లుగా ఎంతో మందిని తీసుకుని శిక్షణ ఇస్తున్నప్పటికీ ఎవ్వరూ శ్రీధర్ స్థాయిలో పాతిక శాతం కూడా న్యాయం చేయలేకపోతున్నారట..!