“ఈనాడు”కి ఇటువంటి రోజులు వస్తాయని రామోజీ కానీ.., ఎండి కిరణ్ కానీ.., ఆ ఉద్యోగులు కానీ.., ఏ మాత్రం ఊహించి ఉండరు. తాము రాసిందే వార్త, తాము అనుకున్నదే చట్టం అనుకునే రీతిలో వ్యవహరించిన “ఈనాడు”కి జగన్ చూపిస్తున్న చుక్కలు మామూలుగా లేవు. అన్నిటికీ మించి ఇప్పుడు అక్రిడేషన్లు రూపంలో ఈనాడుకు గతంలో ఏ నాడూ లేని కష్టాలు వచ్చి పడుతున్నాయ్. అవేమిటో.., వాటి లోతులు ఏమిటో కాస్త లోతుగా తెలుసుకుందాం..!!
రామోజీ అతి తెలివికి నిదర్శనం..!!
ఈనాడు అనేది దిన పత్రిక. దానిలో కంట్రిబ్యూటర్లు (మండలస్థాయి).., స్టాఫ్ రిపోర్టర్లు (జిల్లా స్థాయి ఇంచార్జి).., డెస్కు సబ్ ఎడిటర్లు ఇలా పెద్ద వ్యవస్థ ఉంటుంది. నాలుగు దశాబ్దాల నుండి ఇలాగే నడుస్తున్నాయి. ఇక్కడ కంట్రిబ్యూటర్లు అంటే ఈనాడు ఉద్యోగులు కాదు. వాళ్ళు ఈనాడు తోక సంస్థ (అంటే ఈనాడుకు వార్తలు అందించే “న్యూస్ టుడే” అనే సంస్థ) లో పార్ట్ టైం ఉద్యోగులు అన్నమాట. అలాగే 2016 నుండి వస్తున్న స్టాఫ్ రిపోర్టర్లు కూడా ఈనాడు ఉద్యోగులు కాదు. వాళ్ళు కూడా ఈనాడు తోక సంస్థ ఈనాడు డిజిటల్ (లేబర్ చట్టం నుండి తప్పించుకోడానికి రెమిజి తెచ్చిన కొత్త కంపెనీ ఇది) ఉద్యోగులు. ఇది కూడా ఈనాడుకు వార్తలు అందించే ఒక వేదిక. ఇది ఒక డిజిటల్ మీడియా. ప్రింట్ కాదు. ఈ రెండు రామోజీ అతి తెలివికి నిదర్శనం. గ్రామ, మండల స్థాయిలో వార్తలు అందించడానికి ఫుల్ టైం రిపోర్టర్లు అంటే వేతనాలు భారీగా ఉంటాయని., ఇలా థర్డ్ పార్టీ “న్యూస్ టుడే” ద్వారా వార్తలు తీసుకుంటున్నారు. ఈనాడు రామోజీ దీనికి ఆద్యుడు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి (ఆన్లైన్), సాక్షి (న్యూస్ లైన్) కూడా అనే సంస్థలు తెచ్చాయి.
శ్రమ దోపిడీకి నిదర్శనం ఇదీ..!!
ఇక ఈనాడు డిజిటల్ మాత్రం ఫక్తు డమ్మీ. ఈనాడు (ఉషోదయ ఎంటర్ప్రైజెస్)లో ఉంటె లేబర్ చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ఉద్యోగులను లెక్క చూపించి, వేతనాలు ఎక్కువగానే ఇవ్వాలి. అదే ఈనాడు డిజిటల్ (డిజిటల్ మీడియా) అనే ఒక డమ్మీని స్థాపించి అందులో ఉద్యోగులను తీసుకుని.., ఈనాడుకు ఫుల్ టైం పని చేయిస్తే వేతనం తక్కువ ఇవ్వవచ్చు.., ఈనాడు, ఈటివి, ఈటివి భరత్ అనే మూడు సంస్థలకు కలిపి పని చేయించవచ్చు అనే ఒక “శ్రమ దోపిడీ” ఉద్దేశంతో రూపొందింది ఇది.
* ఉదాహరణకు ఈనాడు (ఉషోదయ ఎంటర్ప్రైజెస్) లో ఉన్న ఒక స్టాఫ్ రిపోర్టర్ / సబ్ ఎడిటర్ కి మూడేళ్ళ సర్వీసు ఉంటె వేతనం కనీసం రూ. 35 వేలు అందుతుంది. కానీ ఈనాడు డిజిటల్ ద్వారా చేరిన ఒక స్టాఫ్ రిపోర్టర్ / సబ్ ఎడిటర్ కి మూడేళ్ళ సర్వీసు ఉంటె రూ. 20 వేలు కూడానా దాటదు. వీళ్ళకి రూ. 35 వేలు వేతనం జీవితకాలంలో చేరే అవకాశం లేదు.
* కానీ ఈనాడు సమ హోదా, దర్పం, గుర్తింపు ఉంటాయి కాబట్టి చాల మంది తక్కువ వేతనాలు ఉన్నా నిలదొక్కుకుంటున్నారు. డెస్క్ లో మాత్రం మూట ముళ్లే సర్దుకుని బయటకు వచ్చేస్తున్నారు.
* మొత్తానికి ఈ “న్యూస్ టుడే” అనేది ఒక మీడియేటర్ సంస్థ. ఈ ఈనాడు డిజిటల్ అనేది ఒక డిజిటల్ మీడియా అని అందరికీ తెలిసినా ఇన్నాళ్లు ఎవరూ అడ్డు చెప్పలేదు. అక్రిడేషన్లు ఇచ్చేసారు.
జగన్ ప్రభుత్వం అడ్డు గోడలు..!!
ఇలా రామోజీ సంస్థలు అతి తెలివితో నిర్వహిస్తున్న “న్యూస్ టుడే”.., “ఈనాడు డిజిటల్” వంటి సంస్థలు అసలు మీడియా కాదు, అక్రిడేషన్ ఇవ్వము అంటూ ప్రభుత్వం తిరస్కరిస్తుంది. దీంతో ఈనాడు కి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈనాడు డిజిటల్ కి అక్రిడేషన్లు ఇస్తే వందలాది డిజిటల్ మీడియాలకు అక్రిడేషన్లు ఇవ్వాలి. కొన్ని ఏళ్ల నుండి వెబ్ మీడియా, డిజిటల్ మీడియాలో నిలదొక్కుకున్న “ఐ డ్రీం మీడియా, తుపాకీ, గ్రేట్ ఆంధ్ర, న్యూస్ ఆర్బిట్, ముచ్చట” వంటి ప్రజాదరణ ఉన్న అనేక డిజిటల్ మీడియా సైట్లకి కూడా అక్రిడేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇదే పాయింట్ లేవనెత్తి ఈనాడు డిజిటల్ కి ఇవ్వము అనీ.., “న్యూస్ టుడే” అనేది ఒక మీడియేటర్ సంస్థ కాబట్టి వారికి అక్రిడేషన్లు ఇవ్వమని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. సో.., ఈ లెక్కన ఈనాడులో అత్యంత కీలకమైన రిపోర్టింగ్ వ్యవస్థకి అక్రిడేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధంగా లేదు. ఇదే జరిగితే ఈనాడు ఇక అధికారిక సమావేశాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కాస్త దూరంగా ఉండాల్సిందే. ఆ దర్పం, ఆ హోదా ఇప్పటికీ కొనసాగిస్తామంటే కుదరనట్టే..! జగన్ ఎత్తుగడ కూడా ఇదే. ఈనాడుని ప్రభుత్వ కార్యకలాపాలకు, కార్యాలయాలకు దూరం చేయాలనేదే మొదటి ఎత్తుగడ. ఎటువంటి అధికారిక సమాచారం కూడా ఈనాడుకు వెళ్ళడానికి వీల్లేదు అనే అనధికార ఉత్తర్వులు ఏడాదిన్నరగా అమల్లోనే ఉన్నాయి..! వీటిని ఈనాడు పెద్దలు ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది..!!