MP RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన రాజీనామా చేయడం దాదాపు కన్ఫర్మ్. రాజీనామా విషయాన్ని ఆయన పదేపదే చెబుతున్నారు. రాజీనామాకు ముందే తన నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనాలని ముఖ్య నేతలతో మాట్లాడాలని అనుకున్నారు కానీ ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరల కేసులు నమోదు చేసిన కారణంగా తన నియోజకవర్గ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే రఘురామ రాజీనామాతో జరిగే నర్సాపురం ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నది. రఘురామ కృష్ణంరాజు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అందుకే ఆయన అమరావతి ఎజెండాతోనే ఉప ఎన్నికలకు వెళతాను అని చెప్పారు. దానితో పాటు అధికార వైసీపీని వ్యతిరేకించే అన్ని పార్టీల మద్దతు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా బీజేపీ, జనసేన మద్దతు తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక. దాదాపుగా ఇది వర్క్ అవుట్ కావచ్చని అంటున్నారు.
MP RRR: పోల్ మేనేజ్మెంట్ వీరే కీలక భూమిక
ఇక అధికార వైసీపీ విషయానికి వస్తే…అధికారంలో ఉంటూ ఉప ఎన్నికల్లో ఆరి తేరింది. పోల్ మేనేజ్మెంట్ లో ఆరితేరింది. ప్రధానంగా నర్సాపురం పార్లమెంట్ పరిధిలో పరిస్థితి చూస్తే.. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గాలిలోనూ పదివేల పైచిలుకు మెజార్టీతో టీడీపీ అభ్యర్ధి గెలిచారు. సంస్థాగతంగా టీడీపీ బలంగా ఉంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇక్కడ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఆళ్ల నానిలు మున్సిపల్ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ కీలక బాధ్యతలను నిర్వహించారు. రేపు ఉప ఎన్నికల్లోనూ వీరే కీలక భూమికను పోషించనున్నారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో సుమారు 15 లక్షల ఓట్లు ఉంటే దానిలో రాజులు (క్షత్రియుల) ఓట్లు లక్షా, లక్షా 30వేల వరకూ ఉంటాయి. కాపు సామాజికవర్గ ఓట్లు సుమారు రెండున్నర నుండి 3 లక్షల వరకూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గ ఓట్లే గెలుపు ఓటములను నిర్ణయించబోతున్నాయి. రాజకీయంగా క్షత్రియ, కాపు, కమ్మ, బీసీ, ఎస్సీ, మైనార్టీ ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి.
నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలంగా వైసీపీ
వైసీపీ తరపున కూడా క్షత్రియ సామాజికవర్గానికే చెందిన గోకరాజు గంగరాజు గానీ ఆయన కుటుంబంలో మరెవరైనా గానీ పోటీకి దిగడం ఖాయంగా కనబడుతోంది. రెబల్ ఎంపీ రఘురామ దిగడం ఖాయం. ఇక్కడ వైసీపీ చాలా పకడ్బందీ ప్లానింగ్ తో వెళుతోంది. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సిగ్మెంట్ లు ఉన్నాయి. నర్సాపురం. పాలకొల్లు, ఉండి. భీమవరం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం సిగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుత పార్టీ బలాలు చూసుకుంటే..టీడీపీ మూడు నియోజకవర్గాల్లో బలంగా ఉండగా, వైసీపీ నాలుగు నియోజకవర్గాల్లో బలంగా ఉంది. ఉండి, పాలకొల్లు, తణుకు ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉంది. జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లులో ఉంది. ఇక్కడ టీడీపీ, జనసేన బలం కలిస్తే రఘురామ కృష్ణంరాజుకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.
MP RRR: ఎన్నికల నిర్వహణలో మంచి వ్యూహకర్త
కానీ అధికార పార్టీ పవర్ పాలిటిక్స్, అలానే మంత్రి శ్రీరంగనాథరాజు ఇటువంటి ఎన్నికల నిర్వహణలో మంచి వ్యూహకర్తగా పేరుంది. అంతర్గత రాజకీయాలు నెరపడంలో ఆయనకు మంచి పేరు ఉంది. పోల్ మేనేజ్మెంట్ చేయడంలో మంచి దిట్ట. ఆర్ధిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. తన సామాజికవర్గానికి సంబంధించి మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. ఈయనతో పాటు మంత్రి ఆళ్ల నాని కూడా అంతే స్థాయిలో వ్యూహాలను అమలు చేయగలరు. అంతర్గతంలో వ్యూహాలు వేయడంలో ఆయన దిట్ట. అధికారంలో ఉన్నారు. ఆర్ధిక వనరులు ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయగలరు. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే రఘురామ కృష్ణంరాజుకు కొంత కష్టమే. అమరావతి సెంటిమెంట్ ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతుందో లేదో తెలియదు. జనసేన, టీడీపీ పూర్తి స్థాయిలో సపోర్టు చేసినా సరే ఎంత మేరకు ఓట్లు వేస్తారో తెలియదు.
పవర్ పాలిటిక్స్. యంత్రాంగాన్ని, పోల్ మేనేజ్మెంట్ ను రఘురామ ఎంత వరకు ఎదుర్కొంటారో..? లేదో తెలియదు. పైగా కేంద్రంలోని బీజేపీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందా..? లేక బయటకు రఘురామ కృష్ణంరాజుకు సపోర్టు చేస్తూ అంతర్గతంగా వైసీపీకి సహకరిస్తుందా ..? అన్నది తెలియదు. రఘురామ కృష్ణంరాజు ఒకే ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక అధికారి. కేంద్ర బలగాలను తీసుకురావాలన్నది ఆయన ప్లాన్. వాళ్లు రాకపోతే ఇక్కడ ఎన్నిక ప్రక్రియ మొత్తం ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయినట్లే లెక్క..! అప్పుడు రఘురామ కృష్ణంరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే. సో.. ఇక్కడ వైసీపీ ప్లాన్ లు ఇలా ఉన్నాయి. రఘురామ ప్లాన్ అలా ఉన్నాయి. ఉప ఎన్నిక ఎలా జరుగుతుంది అనేది వేచి చూద్దాం.