Balakrishna-Chiranjeevi: నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ వస్తే చూడాలని ఎప్పటి నుంచో సినీ ప్రియులు కోరుకుంటున్నారు. ఎంతో మంది దర్శకులు వీరి కలయికలో సినిమా చేయాలని ఆరాటపడ్డారు. కానీ ఇంతవరకు బాలకృష్ణ-చిరంజీవి తెరను పంచుకోలేదు. అయితే గతంలో ఈ సీనియర్ స్టార్స్ కలయికలో రెండు సూపర్ హిట్ చిత్రాలు మిస్ అయ్యాయని మీకు తెలుసా..? అవును మీరు విన్నది నిజమే. మరి ఆ సినిమాలేవో.. అవి ఎలా మిస్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నందమూవీ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో అపూర్వ సహోదరులు ఒకటి. కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విజయశాంతి, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. ఆర్. కె. అసోసియేట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం 1986లో విడుదలై మంచి విజయం సాధించింది. అపూర్వ సహోదరులు సినిమాను బాలకృష్ణ, చిరంజీవి కాంబోలో తీయాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగాన ఈ సినిమాని మొదట ఒక మల్టీ స్టారర్ గా ప్రకటించారు చిత్ర బృందం.
చిరంజీవి మరియు బాలకృష్ణ లతో షూటింగ్ కూడా ప్రారంభించారు. కానీ కొద్ది రోజులు షూటింగ్ జరిగాక ఏవో కారణాల వల్ల చిరంజీవి ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దాంతో చిరంజీవి పాత్రను కూడా బాలయ్యనే పోషించి ద్విపాత్రాభినయం చేశాడు. అలా చిరంజీవి-బాలకృష్ణ కాంబోల అపూర్వ సహోదరులు మిస్ అయింది. ఆ తర్వాత మరోసారి రాఘవేంద్రరావే వీరి కలయికలో మరో సినిమా ప్లాన్ చేశారు.
ఈ చిత్రం మరేదో కాదు శ్రీ మంజునాథ. కోటిలింగేశ్వర ఆలయంలోని భక్త మంజునాథ అనే శివ భక్తుడి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో శివపార్వతులుగా చిరంజీవి, మీనా నటిస్తే.. శివ భక్తుడి అర్జున్ సర్జా, అతని భార్యగా సౌందర్య నటించారు. 2001లో విడుదలైన ఈ భక్తరసా చిత్రం డీసెంట్ హిట్ అయింది. అయితే ఈ చిత్రంలో అర్జున్ పాత్రను బాలయ్య చేయాల్సిందట. మొదట రాఘవేంద్రరావు శివ భక్తుడి పాత్ర కోసం బాలయ్యనే సంప్రదించారు. కానీ ఎందుకో మక్కువ చూపలేదు. దాంతో అర్జున్ ను తీసుకున్నారు.