మన దేశంలో చాలా మంది టీ ప్రియులు ఉన్నారు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి ఉదయం నిద్ర లేచాక టీ తాగనిదే రోజు మొదలు అవ్వదు. ఏదన్నా ఒక్కరోజు టీ తాగకపోతే ఆ రోజు అంతా ఎంతో మూడీగా ఉంటూ ఉంటారు.అదే ఉదయాన్నే టీ తాగితే మాత్రం ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. అంతలా కొందరు టీ కు అలవాటు పడిపోయారు. పొద్దున నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు టీ షాప్స్ లో జనాల హడావిడి మాములుగా ఉండదు.
అయితే టీ అనేది ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు అని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు.నిజానికి టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. టీ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు చురుకుగా ఉండేలా చేస్తాయి.కానీ టీను ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉదయాన్నే ఏమి తినకుండా వేడి వేడి చాయ్ తాగడం వల్ల పొట్టలో యాసిడ్ లెవెల్స్ పెరిగి, జీర్ణక్రియపై ప్రభావం పడుతుందట.తద్వారా అజీర్తి, గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొందరు తలనొప్పిని తగ్గించుకునేందుకు టీ తాగుతూ ఉంటారు. టీ నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చినప్పటికీ ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి.ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఏర్పడుతుంది కాబట్టి టీను ఏదన్నా ఆహారం తిన్నాక తాగితే మంచిది.