రక్తపోటు ఉన్నవారంతా ఉదయమే టిఫిన్ చేసిన తర్వాత మందులు వేసుకుంటారు. కానీ ఉదయం కన్నా రాత్రి నిద్రపోయేముందు మందులు తీసుకుంటే మంచిదని తాజా పరిశోధనా ఫలితాలు సూచిస్తున్నాయి.
రాత్రి నిద్రపోయేముందు బిపి మందులు తీసుకోవడం వల్ల బిపి బాగా కంట్రోల్లో ఉండడమే కాకుండా గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా తగ్గుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
స్పెయిన్లో జరిగిన ఈ అధ్యయనంలో 19,084 మంది రక్తపోటు ఉన్నవారు పాల్గొన్నారు. వారిలో 8,470 మంది మహిళలు. వారికి గతంలో వైద్యులు రాసిన మందులు కొందరిని రాత్రి పడుకోబోయే ముందు, కొందరిని ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాల్సిందిగా కోరారు. ఆరేళ్ల పాటు వారిని పరిశీలించారు.
ఆరేళ్ల తర్వాత చూస్తే రాత్రి నిద్రించేముందు మందులు తీసుకున్నవారిలో రక్తపోటు నియంత్రణ బాగా ఉన్నట్లు బయటపడింది.అంతేకాకుండా కార్డియో వాస్క్యులార్ సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం వీరిలో తక్కువ ఉన్నట్లు కూడా గుర్తించారు. గుండె, రక్తనాళాల లోపాల కారణంగా మరణించే అవకాశం 66 శాతం తగ్గింది. స్ట్రోక్ వచ్చే అవకాశం 49 శాతం తగ్గింది. గుండెపోటు అవకాశం 44 శాతం తగ్గింది. గుండె వైఫల్యం అవకాశం 42 శాతం తగ్గింది.
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన స్పానిష్ శాస్త్రవేత్త ఫ్రొఫెసర్ రామన్ హెర్మిదా ఏమంటారంటే రక్తపోటు చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలు ఏ సమయంలో మందులు తీసుకోవాలో నిర్దేశించడం లేదు. ఉదయం రక్తపోటు స్థాయి తగ్గించాలన్న లెక్క ప్రకారం వైద్యులు పొద్దున్నే మందులు తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ అలా తీసుకున్నందువల్ల కార్డియోవాస్య్కులార్ లోపాల ప్రమాదం తగ్గుతుందని ఏ అధ్యయనమూ కూడా సూచించడం లేదు.
అయితే ఈ అధ్యయనానికి ఒక పరిమితి ఉంది. అదేమంటే ఇందులో పాల్గొన్నవారంతా శ్వేతజాతీయులు. కాబట్టి రంగు జాతుల వారికి కూడా ఈ అధ్యయనం ఫలితాలు వర్తిస్తాయని చెప్పలేం.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.