Maharashtra: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన గురించి చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపైనా, కూటమి ప్రభుత్వం పైనా తరచు విమర్శలు, ఆరోపణలు చేసే ఫడ్నవీస్ తాజాగా శివసేనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో పోటీ చేసిన శివసేన.. ముఖ్యమంత్రి పదవీ పై పేచీతో బీజేపీతో తెగ తెంపులు చేసుకుని కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఫడ్నవీస్ శివసేనపైనా, కూటమి ప్రభుత్వంపైనా తరచు విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఇటీవల ఎన్టీసీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఫడ్నవీస్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలోని సమస్యలపై ప్రధాన మంత్రి మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి రాష్ట్రంలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అయిదేళ్లు కొనసాగుతుందంటూ ఇటు ఎన్సీపీ, శివసేన నేతలు చెబుతూ వస్తున్నారు. కూటమి బంధాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు బీజేపీ ప్రారంభిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.
Maharashtra: మాజీ సీఎం ఫడ్నవీస్ ఏమన్నారంటే..?
బీజేపీకి శివసేన ఎప్పుడూ శత్రువు కాదు. మిత్రులేనన్నారు. రెండు పార్టీలు కలిసి మళ్లీ కూటమిని ఏర్పాటు చేస్తాయా అన్న మీడియా ప్రశ్నకు పరిస్థితులను బట్టి సరైన నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చారు. అభివృద్ధి కోసమే బీజేపీ, శివసేన వ్యతిరేకంగా పోరాడాయనీ, వారు మమ్మల్ని విడిచి ఇతరులుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాజకీయాల్లో కానీ, అయితే పదాలకు తావుండదని అన్న ఫడ్నవీస్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారిపోతుంటాయన్నారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. రానున్న అయదేళ్లు శివసేన కాంగ్రెస్ బంధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే కూటమిలో మార్పులపై ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి.