PM Modi: పార్లమెంట్ పై ఇటీవల ఆగంతకుల దాడిపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ ఉభయ సభల్లో విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నాయి. దీంతో ఉభయ సభల నుండి దాదాపు 142 మందికిపైగా సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఉభయ సభ్యులు ప్రతిపక్షాల వ్యవహార శైలిని తప్పుబడుతూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందించడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కానీ కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని కూలదోయడాన్నే ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. పార్లమెంట్ లో జరిగిన భద్రతా ఉల్లంఘనను ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలి కానీ ప్రతిపక్షాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి ప్రవర్తన వల్ల 2024 సార్వత్రిక ఎన్నికల్లో వారి సీట్ల సంఖ్య మరింత తగ్గి, బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షం తీవ్ర నిరాశకు గురైందని అన్నారు మోడీ. అందుకే పార్లమెంట్ నిర్వహణకు అడ్డుపడుతోందని విమర్శించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు మోడీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు చేశారన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు మర్యాదపూర్వకంగా స్పందించాలని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచాలని మోడీ ఎంపీలకు సూచించారన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీలు సరిహద్దు గ్రామాల్లో పర్యటించాలని ప్రధాని కోరినట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు.
మరో పక్క ఉభయ సభల్లో సభ్యుల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యచరణపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం సమావేశం అయ్యారు.
INDIA Alliance: పార్లమెంట్ సమావేశాలపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న ఇండియా కూటమి