Pondicherry : దక్షిణ భారతదేశంలో అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటి పుదుచ్చేరి. ఇక్కడ ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. మారుతున్న రాజకీయ ముఖచిత్రం తోపాటు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోపక్క పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ను కేంద్రం అకస్మాత్తుగా తొలగించి, ఆ బాధ్యతలను తెలంగాణ గవర్నర్ తమిళ సై కు అప్పగించారు. అసలు ఏం జరుగుతుందో అర్ధం అయ్యేలోపే మరో పరిణామం జరగడంతో కేంద్రపాలిత ప్రాంతంలో అసలు ఏం అవుతుందన్న సందిగ్ధం అంతటా వ్యక్తమవుతోంది. మరోపక్క కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ సరిగ్గా పుదుచ్చేరి పర్యటన పెట్టుకున్న సమయంలోనే వరుసగా ఈ పరిణామాలు జరగడం కాంగ్రెస్కు మింగుడు పడడం లేదు.
కొద్ది రోజుల్లో ఎన్నికలు!
పుదుచ్చేరి అసెంబ్లీ కు త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొనడం వరుసగా జరుగుతున్న నాటకీయ పరిణామాలు పలు అనుమానాలను లేవనెత్తుతున్నాయి. నిజాయితీ గల అధికారి గా పేరు తెచ్చుకున్న కిరణ్ బేడి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అంతే చక్కగా పని చేశారన్న పేరు సంపాదించుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆమె ను తొలగించడం వెనుక అసలు కారణాలు ఏమిటి అన్నది అంతుబట్టడం లేదు. దీనికి పలువురు పలు రకాల వ్యాఖ్యానాలు, ప్రచారాలు చేస్తున్నారు. దీని వెనుక కేంద్రం సాగించే రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు ఇప్పుడు అందరికీ పలుకుతున్నాయి.
ఎప్పటి నుంచో సిఎంతో విభేదాలు
పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కి మధ్య ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. ఆమెను తొలగించాలని ముఖ్య మంత్రి నారాయణస్వామి పలుమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కిరణ్ బేడి నియంతలా వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలను సైతం అడ్డుకోవాలని చూస్తున్నారని, ఆమె పరిధులకు మించి వ్యవహరిస్తున్నారంటూ పలుమార్లు నారాయణస్వామి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాదు కిరణ్బేడీ కు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమాలను ఏకంగా ముఖ్యమంత్రి చేశారు. దీనికి కాంగ్రెస్కు వామపక్ష నేతలు కూడా మద్దతు తెలిపారు. 2019 డిసెంబర్లో ఏకంగా రాజ్ భవన్ ఎదుట ముఖ్యమంత్రి ధర్నా కూడా చేశారు. ఇటీవల కాలంలో కిరణ్ బేడీ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఆమె నియంత పొగడ మరింత ఎక్కువయిందని నారాయణస్వామి చెప్పడం విశేషం.
** ఇటీవల పుదుచ్చేరిలోని ప్రభుత్వ స్థలంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిని కిరణ్బేడి అడ్డుకోవడం అప్పట్లో వివాదం అయింది. ప్రభుత్వ స్థలాల్లో ఇష్టానుసారం విగ్రహాలు ఏర్పాటు చేస్తే తర్వాత ఎంతో ఇబ్బంది అవుతుంది అని ఆమె వ్యాఖ్యానించారు. coffey టైంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రోజువారీ నివేదికలు సైతం లెఫ్ట్నెంట్ గవర్నర్గా తనకు అసలు రావడం లేదని ఆమె బహిరంగంగా చెప్పడం అప్పట్లో సంచలనం అయ్యింది.
మైనారిటీ లోకి ప్రభుత్వం
శాసనసభ్యులు వరుస రాజీనామాలతో పుదుచ్చేరి ప్రభుత్వం మైనారిటీలో పడినట్లు అయింది. శాసనసభ ఎన్నికలకు ముందే రాజకీయ సంక్షోభం తలెత్తే నట్లు అయింది. పుదుచ్చేరి శాసనసభలో మొత్తం సభ్యులు 30. ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ మార్కు 16. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, డీఎంకే కలిపి 18 మంది బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీరిలో ఇటీవల మంత్రి నమశివాయ, ఎమ్మెల్యే తిపయన్ దాస్ కాంగ్రెస్కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. సోమ మంగళ వారాల్లో ఎమ్మెల్యేలు కృష్ణారావు, జాన్ కుమార్ లు రాజీనామాలు చేయడం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. 18 మంది సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నలుగురు సభ్యుల రాజీనామాతో 14కు బలం తగ్గింది. దీంతో ప్రభుత్వం సైతం మైనారిటీలో పడింది. దీంతో అసలు ఇప్పుడు పుదుచ్చేరిలో ఏం జరుగుతుంది అన్నది కీలకంగా మారబోతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?