Ayodhya: అయోధ్య లోని రామమందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బుధవారం తొలి శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీరాముడి నుదిటిపై పడే సూర్యుడి కిరణాలపై ఉంది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. గుడి మూడవ అంతస్తు నుండి గర్భగుడిలోని సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.
ప్రతి ఏడాది శ్రీరామ నవమి రోజున బలరాముడి విగ్రహం నుదుట కిరణాలతో తిలకం ఏర్పాటు చేయడమే సూర్య తిలక్ ముఖ్య ఉద్దేశం. చైత్రమాసంలో సాక్షాత్కరించే ఈ అద్భుత దృశ్యాన్ని మధ్యాహ్నం 12.15 నిమిషాలకు భక్తులు వీక్షించారు. మూడున్నర నిమిషాల పాటు ఈ సూర్య కిరణాల తిలకాన్ని భక్తులు వీక్షించి తరించారు. రెండు నిమిషాల పాటు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపించి. బలరాముడి నుదుటిని సూర్యుడు ముద్దాడాడు అని పేర్కొంటున్నారు. సూర్య అభిషేకం, సూర్య తిలకంగా పిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించారు.
ఈ ఏడాది జనవరి 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మంగళవారమే సూర్య కిరణాల ప్రసరణ ప్రక్రియను శాస్త్రవేత్తలు పరిశీలించారు. సూర్య తిలకం కోసం మూడో అంతస్తులో విదేశాల నుండి తెప్పించిన అద్దాలను అమర్చారు. సూర్య కిరణాలు అందులో పడి రెండో అంతస్తులోకి, ఆపై గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నగర్భగుడి లోని బాలక్ రామ్ విగ్రహం నుదుటిపై పడతాయి. సూర్యుడి డైరెక్షన్, కిరణాలు ప్రసరించే కోణాన్ని లెక్కగట్టి ఈ అద్దాలను అమర్చారు. ఏడా రామ నవమి రోజు మాత్రమే ఈ అద్భుతం సాక్షత్కరించేలా డిజైన్ చేశారు. రాముడి నుదిటిపై సూర్యకిరణాలు పడిన మరుక్షణం భక్తులు తన్మయత్వం చెందారు.
మందిర నిర్మాణం తర్వాత తొలి శ్రీరామ నవమి కావడంతో మందిర పరిసరాలను అందంగా అలంకరించారు. అశేషంగా తరలివచ్చిన భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా ఆలయంలో భక్తులకు చలువ పందిళ్లు వేశారు.