Tamil Nadu government: కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షల నిర్వహణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో స్టాలిన్ సర్కార్ 12వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా మూడు రోజుల పాటు విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, నిపుణులతో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. మార్కుల కేటాయించే అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ స్కార్ ఆధారంగా ఉన్నత విద్యకు ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో పాటు థర్డ్ వేవ్ ముప్పు ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. మార్కులకు కేటాయించే అంశంపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
Read More: Minister Harish Rao: ఈటల వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు స్పందన ఇదీ..!!
తమిళనాడులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. ఒకే ఒక్క రోజు 21,410 కేసులు నమోదు కాగా 443 మరణాలు సంభవించాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో నీట్ సహా అన్ని జాతీయ స్థాయి పరీక్షలు రద్దు చేయాలని సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్టాలిన్ లేఖ కూడా రాశారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందే సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే ముఖ్యమని పీఎం మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భయాందోళనల మధ్య విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని మోడీ స్పష్టం చేశారు.