ఓ పక్క మా పార్టీ అధికారంలోకి వస్తే… మధురై ని రాష్ట్రానికి రెండవ రాజధాని చేస్తానని, 50శాతం మంత్రి పదవులు మహిళకు కట్టబెడతాను అంటూ మక్కల్ నీది మయ్యమ్ అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ సంచలన హామీలు ఇస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం. కమల్ కు షాక్ ఇచ్చారు. నేడు ఆయన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఓ పక్క కమల్ ప్రచారాన్ని ఉదృతం చేసిన తరుణంలో అరుణాచలం పార్టీ కి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పార్టీ వ్యవహారాల పట్ల ఆయన అసంతృప్తితోనే మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వీడి బీజేపీలో చేరారని చెబుతున్నారు. మరి కొద్ది నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా రాష్టంలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. మరో పక్క బీజేపీ రాష్టంలో బలాన్ని పెంచుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపింది. రాష్ట్రంలో దూకుడు పెంచిన బీజేపీ.. వివిధ పార్టీలోని అసమ్మతి నేతలకు గాలం వేసి పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమైంది.
ఇది ఇలా ఉండగా.. ఈ నెల 31న రాజకీయ పార్టీ ప్రకటన చేస్తానని తెలియచేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. దీనితో తమిళనాడులో రrజనీ అభిమానులు అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తలైవా త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు.