Vizag steel : ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ Vizag steel వైజాగ్ స్టీల్. అన్ని పార్టీల ది అదే దారి. అందరు నాయకులు ది విశాఖ ఉక్కు వాణి. పరిశ్రమను ప్రైవేటు పరం కానీయకుండా ఉద్యమిస్తాం అంటూ నాయకులు రకరకాలుగా చెబుతున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు కేంద్రానికి వినతులు చేస్తున్నారు. అసలు విశాఖ ఉక్కు ను ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకునే మార్గాలేమిటి? అసలు అది సాధ్యమేనా? దీనికి ప్రత్యామ్నాయం మరి ఏమైనా ఉందా? అంటే… చదివేయండి.
పెట్టుబడుల ఉపసంహరణకు కట్టుబడి
బీజేపీ నమ్మేది ఒకటే. ప్రభుత్వం అనేది పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టాలి. అంతే తప్ప వ్యాపారాలు పరిశ్రమలు నడుపుకుంటూ పోతే ప్రభుత్వానికి విలువ ఎం ఉంటుంది అన్నది ఆ సూత్రం. దీని ఆధారంగానే క్రమక్రమంగా కేంద్ర పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి ప్రత్యేకమైన కమిటీలను వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా 1.75 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. దీనిలో భాగంగానే ఐడిబిఐ బ్యాంకు, బిపిసిఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, ఎయిర్ ఇండియా, సీపీఎస్ఈ ల విక్రయ కార్యక్రమాన్ని పూర్తి చేసి రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక జనరల్ భీమా సంస్థలను ఏడాదిలోగా ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎల్ఐసి ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కి తెచ్చి ఆ సంస్థ ప్రైవేటీకరణకు తొలి అడుగు వేయాలని నిర్ణయించుకుంది. నీతి ఆయోగ్ సైతం భవిష్యత్తులో ఏ సంస్థలను ప్రైవేట్ ఫారం చేయొచ్చు అన్న దాని మీద ఒక నివేదిక సిద్ధం
చేసింది.
మోదీ దూకుడు…
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు ఉపసంహరణకు మోడీ ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తోంది. 1991లో పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ఎక్కువయింది. పీవీ సర్కారు భారత దేశం దివాలా అంచుకు వెళ్లిన సమయంలో బయటపడడానికి ఈ పెట్టుబడుల ఉపసంహరణకు ధర లేపితే తర్వాతి ప్రభుత్వాలు దానిని అలాగే కొనసాగించాయి. భారీ ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ వాజ్పేయి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. దీని కోసం ఏకంగా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను మంత్రి వర్గ సంఘాన్ని సైతం ఏర్పాటు చేశారు. నరేంద్రమోడీ తొలివిడత సర్కారులో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయించి 2. 79 లక్షల కోట్లు సమీకరించారు.
తొందరపాటు అవసరమా??
రైల్వేలు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎల్ఐసి విశాఖ ఉక్కు కర్మాగారాల ప్రైవేటీకరణ ప్రతిపాదనపై ప్రస్తుతం దేశంలో లోతుగా చర్చ జరుగుతోంది. విశాఖ ఉక్కు పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. సీపీ ఎస్ఈ లను వర్గీకరించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణపై ముందుకు వెళితే బాగుంటుంది. ఎప్పటికీ నష్టాలు వస్తాయని అంచనా వేసి ప్రైవేటీకరణకు వెళ్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా రైల్వేలు విశాఖ ఉక్కు వంటి సంస్థలను కాస్త బుర్ర పెట్టి ఆలోచన చేస్తే లాభాల్లోకి తీసుకురావచ్చు. దీనిని కేంద్రం ఎక్కడ చేసినట్లు కనిపించడం లేదు. ఎల్ఐసి, జిఐసీ వంటి సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా ఉంటాయి. అలాంటి వాటిలో ను ప్రైవేటీకరణను తీసుకువస్తే తర్వాత వచ్చే నష్టాలను కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి దీనిమీద నిర్ణయాలను పునః సమీక్షించాలి.