Chandrababu Naidu.. ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డపై ఫైర్ అవడం ఆసక్తి రేపుతోంది. ఆరోపణల నుంచి తప్పించుకోవడానికేనా అనే ఆరోపణలు లేకపోలేదు. పార్టీలు ఒకరిని మరొకరు తిట్టుకోవడం సహజం. కానీ.. కొత్తగా రాజ్యాంగ వ్యవస్థపై దాడి చేయడం బహుశా ఇంతకుముందు చూడనిదనే చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఉంటుందని మాత్రమే తెలిసిన ప్రజలకు ఆ వ్యవస్థ ఏం చేయగలదో.. కమిషనర్ ఎటువంటి అధికారాలు ఉపయోగించగలరో ప్రజలకు క్లియర్ గా తెలిసేలా పరిస్థితులు వచ్చాయి. భవిష్యత్తులో ఏ పార్టీ అయినా ఎన్నికల కమిషన్ తో ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రస్తుత పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి. 2020 మార్చిలో అధికార పార్టీ వైసీపీకి ఎన్నికల కమిషన్ కు మధ్య మొదలైన ‘పంచయితీ’ దాదాపు ఏడాదిపాటు కొనసాగింది. పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషన్ చంద్రబాబు చెప్పినట్టే చేస్తోందంటూ వైసీపీ విరుచుకుపడింది. ఇప్పుడు అదే చంద్రబాబే ఎన్నికల కమిషన్ ను దుమ్మెత్తిపోయడం విడ్డూరంగా అనిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం – ఎన్నికల కమిషన్ Election commission ‘పంచాయితీ’..
2020లో పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు సిద్ధమైన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షాకిచ్చారు. కరోనా వల్ల వాయిదా వేస్తున్నామంటూ. దీంతో సీఎం జగన్ రంగంలోకి దిగి చంద్రబాబు సామాజికవర్గమే అయిన నిమ్మగడ్డ ఆయన చెప్పనట్టే నడుచుకుంటున్నారు.. అన్నారు. అక్కడ మొదలైన యుద్ధం నిరంతరంగా ఏడాదిపాటు కొనసాగింది. వాదప్రతివాదాలు, దూషణలు, నిమ్మగడ్డను తొలగిస్తూ ఆర్డినెన్స్, లోకేశ్ కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించడం, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు.. ఇలా నాన్ స్టాప్ గా ‘పంచాయితీ’ జరుగుతూనే ఉంది. నిమ్మగడ్డను వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించిన వెంటనే.. టీడీపీ నుంచి వర్ల రామయ్య లైన లోకి వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. మాజీ గవర్నర్ నరసింహన్ వద్ద పని చేసిన నిమ్మగడ్డను చంద్రబాబు అప్పట్లో సిఫార్సు చేయడంతో ఎన్నికల కమిషనర్ గా నియమించారు. నిజానికి ఈ పంచాయతీ ఎన్నికలు 2018లోనే జరగాల్సి ఉన్నా.. అప్పట్లో చంద్రబాబు నిర్వహించలేదు. అప్పట్లో పట్టుబట్టని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయాన్ని వాయిదా వేయడమే కాకుండా.. ఇప్పుడు ఎన్నికలు వద్దంటే మాత్రం జరపాల్సిందే అన్నారు.
వైసీపీ ఆరోపణలు..
ఇలా నిమ్మగడ్డపై దాదాపు ఏడాది పాటు విమర్శిస్తూ వైసీపీ నాయకులు.. మద్దతిస్తూ టీడీపీ నాయకులు గడిపేశారు. మొత్తానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత పూర్తైంది. అయితే.. హఠాత్తుగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో విఫలమయ్యారు. ఎన్నికల కమిషన్ తన విశేష అధికారాలను ఉపయోగించ లేదు. ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుందని భావిస్తున్నట్టున్నారు.. నిబద్ధతతో, నిష్పక్షపాతంగా జరిపించాలి అని మర్చిపోయారు. గవర్నర్ కూడా చూస్తూ ఉరుకుంటున్నారు. వ్యవస్థల్ని కాపాడాల్సిన ఆయన కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. అధికారపార్టీపై ఇద్దరికీ ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోవడం లేదు’ అంటూ ఫైర్ అయ్యారు. ఏకంగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందిందని కేంద్ర అధికారులు, బలగాలను పంపాలని లేఖలు రాశారు. అయితే.. పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో రిలీజ్ చేసిన చంద్రబాబుపై నిమ్మగడ్డ పెద్దగా చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో నిమ్మగడ్డపై చంద్రబాబు ఫైర్ నిజమేనా.. నిమ్మగడ్డ నిజంగానే ఫెయిల్ అయ్యారా..? అనేది ఓ ప్రశ్న.
నిమ్మగడ్డపై చంద్రబాబు ఫైర్ నిజమేనా..?
సీఎం జగన్ చెప్తున్నట్టు నిమ్మగడ్డతో మాకు సంబంధం లేదు.. అని కూడా టీడీపీ గట్టిగా చెప్పింది లేదు. 2018లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనప్పుడూ నిమ్మగడ్డ పట్టుబట్టలేదు. పైగా.. చంద్రబాబు సూచనతోనే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిజంగానే నిమ్మగడ్డను విమర్శించారా..? అంటే నమ్మదగినది కాదు. నిమ్మగడ్డ తమ మనిషి అని వైసీపీ వేస్తున్న ముద్రను చెరిపేసేందుకే.. చంద్రబాబు ఈ ప్రయత్నం చేశారని.. మరో నెలలో రిటైర్ అయ్యే నిమ్మగడ్డను విమర్శించినా ఆయన కెరీర్ కు వచ్చే నష్టం ఏమీ ఉండదనే చంద్రబాబు ఈ డ్రామాకు తెర తీశారని వైసీపీ ఆరోపిస్తోంది. తాను వైఎస్ ఆశీస్సులతోనే రాజ్ భవన్ కు వెళ్లాను.. ఆయన వల్లే ఎదిగాను అని నిమ్మగడ్డ చెప్పినా వైసీపీ పట్టించుకోలేదు. ఎన్నికల కమీషన్ కు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తూండటంతో నిమ్మగడ్డతో లాభం లేదనుకునే చంద్రబాబు విమర్శల డ్రామా ఎత్తుకున్నారని కూడా వైసీపీ అంటోంది. ఏమైనా చంద్రబాబు తీరు ప్రజలకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయనే చెప్పాలి.