చాలా సంవత్సరాల తర్వాత యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న వైరస్ ఏదైనా ఉందంటే అది కేవలం కరోనా వైరస్ (కోవిడ్-19) మాత్రమే. ఎందుకుంటే ఈ వైరస్ ఇప్పటికే సృష్టించిన సంక్షోభం అంతాఇంకా కాదు. మొదట చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన ఈ కరోనా మహమ్మారి.. తన విశ్వరూపాన్ని చూసిస్తూ.. అతి తక్కువ కాలంలోనే అన్నీ దేశాలకు విస్తరించి.. తన ప్రభావాన్ని పెంచుకుంటూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 6 కోట్లకు దగ్గరగా ప్రజలు ఈ వైరస్ బారినపడ్డారు.
అలాగే, దాదాపు 13 లక్షల మంది ఈ కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రజల ప్రాణాలు తీయడంతో పాటు యావత్ ప్రపంచాన్ని ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టింది ఈ కోవిడ్-19. చాలా దేశాలు కరోనా విజృంభణకు అడ్డుకట్ట వేయడానికి లాక్డౌన్ను ప్రకటించాయి. దీంతో ఆయా దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు క్షీణించడంతో కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయారు. తినడానికి తిండిలేని దరిద్రంలోకి జారుకున్న వారు కోట్లల్లో ఉన్నారు.
అయితే, ఇటీవలే పలు వ్యాక్సిన్లు ఆశాజనకంగా ఫలితాలు రాబట్టడంతో వచ్చే ఏడాది వరకూ పరిస్థితులు కుదుటపడుతాయని అనుకుంటున్న వేళ నోబెల్ విజేత అయిన ప్రపంచ ఆహార కార్యక్రమం (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్-డబ్ల్యూఎఫ్పీ) చీఫ్ డేబిడ్ బేస్లీ సంచలన, ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. 2020 ఏడాది కంటే రాబోయే ఏడాది (2021)లో పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయనీ, 2021 సంవత్సరం మరింత దరిద్రంగానూ, భయానకంగానూ ఉండబోతుందని డేవిడ్ బేస్లీ అన్నారు. ఇప్పటికే చాలా దేశాలు కరోనా కారణంగా దరిద్రంలోకి జారుకున్నాయనీ, మరికొన్ని దేశాలు సైతం అదే దిశగా పయనిస్తున్నాయని తెలిపారు. కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆకలి అనే మహమ్మారి సైతం పీక్స్ కు చేరబోతున్నదని తెలిపారు.
ఇప్పటికే చాలా దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు, పేదలకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ఉన్న నిధులతో 2020ను ఎలాగోలా మేనేజ్ చేశారు కానీ, వచ్చే ఏడాదిని ఎదుర్కొవడం క్లిష్టంగా మారిందని అన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని 50కి పైగా దేశాలు దివాళా తీశాయని తెలిపారు. ఒక్కచైనా మినహా అన్ని దేశాల ఆర్థిక వృద్ధి మైనస్ లోకి జారుకున్నదని తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి కరోనాను అడ్డుకునే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. దాని ప్రజలందరికీ పంపిణీ చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుందని అన్నారు. ఏదేమైనప్పటికీ.. ఆశావాద దృక్ఫధంతో ముందుకు సాగడం కీలకమని తెలిపారు.