అందం.. అలంకరణలో బంగారు ఆభరణాలు, వజ్రాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని అలంకరించుకోవడానికి మగువలు చూపే ఆసక్తి అంతాఇంతా కాదు. ఆడవాళ్లతో పాటు పురుషులు కూడా ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు మెడ గోలుసులు, చేతి రింగులలో వజ్రాలు ధరించడానికి మక్కువ చూపిస్తుంటారు. దీంతో బంగారంతో పాటు వజ్రాలకు (డైమండ్స్) ఎనలేని డిమాండ్ ఉంటుంది. మార్కెట్ వ్యాపారులు సైతం బంగారం, వజ్రాలపై పెట్టుబడులు పెట్టడంలో ముందుంటారు.
అయితే, డైమండ్స్ కు ఉన్న డిమాండ్ ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. కొన్ని సార్లు చాలా అరుదైన వజ్రాలు వెలుగుచూస్తుంటాయి. వాటి ధర సైతం రికార్డు స్థాయిలో ఉంటుంది. ఇలాంటి ఓ అత్యంత అరుదైన ఓ వజ్రం తవ్వకాల్లో బయటపడింది. చాలా అరుదైన, అత్యంత విలువైన పింక్ కలర్లో మెరిసిపోతున్న ఈ డైమండ్ వేలం పాటలో ఎంత ధర పలికిందో తెలిస్తే.. మీరు షాక్ కు గురవ్వాల్సిందే. ఇటీవల జరిగిన బిడ్డింగ్ లో ఈ పింక్ కలర్ డైమండ్ 21 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది.
అవును నిజమే దాని విలువ, ప్రత్యేకత అలాంటిది మరి ! దాదాపు మన ఇండియన్ కరెన్సీలో రూ. రెండు వందల కోట్ల వరకూ ఉంటుంది. ఇంత భారీ వేలంపాట స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది. దీనిని వేలం నిర్వహించిన సోథేబైస్ సంస్థ ఈ డైమండ్ గురించి మాట్లాడుతూ.. ఇది ప్రకృతి యొక్క నిజమైన ఆత్మఅనీ, ఇది రష్యాలో దొరికిందని తెలిపింది. అయితే, ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ డైమండ్ బరువు 14.83 క్యారెట్లుగా ఉందని తెలిపారు. ఇలాంటి వజ్రాలు చాలా అరుదుగా కనిపిస్తాయని వివరించారు.
2017లో రష్యాలో జరిపిని తవ్వకాల్లో ఈ పింక్ డైమండ్ బయటపడింది. దీనిని ఆ దేశ వజ్రాల ఉత్పత్తి దారుడు అల్రోసా తవ్వారు. దీనికి దాని జాలక నిర్మాణం కారణంగా ఈ పింక్ కలర్ వచ్చిందని ఆయన తెలిపారు. అతిపెద్ద పింక్ డైమండ్ నుంచి దీనిని కత్తిరించినట్టు వెల్లడించారు. ఈ వజ్రానికి “ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్” అని పేరు పెట్టినట్టు తెలిపారు. కాగా, 2018లోనూ గులాబి రంగులో ఉన్న ఓ డైమండ్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో నిర్వహించిన వేలం పాటలో ఏకంగా రూ.360 కోట్లకు అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే.