Afghanistan: అఫ్ఘనిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు దేశంలో మహిళా విద్యపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ఆ దేశ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. తాలిబన్లు తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటంటే..యూనివర్శిటీల్లో మహిళలు చదువుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే యువతీ యువకులకు వేరువేరు తరగతులు ఉంటాయని స్పష్టం చేశారు. మహిళలు తప్పని సరిగా ఇస్లామిక్ సంప్రదాయ దుస్తులే ధరించాలన్న నిబంధన విధించారు. బోధన అంశాల్లోనూ పలు మార్పులు తెస్తామని తాలిబన్ మధ్యంతర ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియమితులైన అబ్దుల్ బఖీ హక్కానీ తెలిపారు. ఇటీవల తీవ్ర విధ్వంస పరిణామాల అనంతరం అప్ఘనిస్థాన్ లో మరో సారి తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న నేపథ్యంలో మొత్తం ప్రపంచం తాలిబన్ల తీరును గమనిస్తోంది.
1990లో మొదటిసారి అధికారాన్ని చేపట్టిన సమయంలో తాలిబన్లు మహిళలకు విద్యను నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రజా జీవితంలో మహిళల పాత్రను వారు తిరస్కరించారు. తాజాగా మహిళా విద్యపై తాలిబన్లు తమ వైఖరిని మార్చుకున్నట్లు కనబడుతోంది. తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆప్ఘన్ మహిళలు స్వాగతిస్తున్నట్లు తెలిసింది. కాబూల్ యూనివర్శిటీలో నిర్వహించిన ఓ సదస్సులో మహిళలు తాలిబన్ల జెండాలను ప్రదర్శిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.